అయోమయం: ముద్రగడపై ప్రభుత్వ ఎత్తుగడ ఏమిటి?
కాకినాడ: కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని అరెస్టు చేశారా, లేదా అనే విషయంలో అయోమయం నెలకొంది. అయితే, తుని ఘటనలో అయితే తప్ప తాను అరెస్టుకు అంగీకరించబోనని ముద్రగడ పట్టుబట్టిన నేపథ్యంలో సిఐడి అధికారులు కూడా దీక్ష చేస్తున్న సమయంలో కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వచ్చారు.
తుని విధ్వంసం కేసులో సిఐడి ఆయనను అరెస్టు చేశారని, సిఐడి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని తొలుత ప్రచారంలోకి వచ్చింది. అరెస్టు అనేది జరిగివుంటే శుక్రవారం సాయంత్రానికే ముద్రగడను కాకినాడ సిఐడి కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. అలా జరగలేదు. దీంతో ఆయన పోలీసుల అదుపులో ఉన్నట్టే భావించాల్సి వస్తోంది.
ఆత్మహత్యాయత్నం చేసుకోబోయాడు కాబట్టి అదుపులోకి తీసుకున్నారనే వాదన వినిపిస్తోంది. తుని హింస కేసులోనే ముద్రగడను అరెస్టు చేస్తున్నట్టు అరెస్టు వారెంట్తో సహా సిఐడి పోలీసులు కిర్లంపూడి వచ్చిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ముద్రగడపై స్థానిక పోలీసులు కూడా కేసు నమోదు చేసి, అరెస్టు చూపించే అవకాశం ఉంది.
అదే సమయంలో అమలాపురం పోలీస్ స్టేషన్లో విధులకు ఆటంకం కలిగించారనే కారణంతో మరికొన్ని సెక్షన్లను ముద్రగడపై నమోదు చేశారు. అంటే అరెస్టుకు ఇన్ని రకాల కారణాలున్నప్పటికీ ఇంతవరకు అరెస్టు చూపకుండా, కోర్టుకు తరలించకుండా ఆసుపత్రిలోనే ఉంచారు.
కాగా, ముద్రగడ ఆసుపత్రిలో కూడా దీక్షను కొనసాగిస్తున్నారు. పట్టుదలతో ఉన్న ఆయన ఆహారాన్ని తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ముద్రగడ అరెస్టు అంటూ జరిగితే అందరి మాదిరిగానే సిఐడి కోర్టు ఆయనకు రిమాండ్ విధించే అవకాశం ఉంది. దీంతో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించాల్సి ఉంటుంది. దాని వల్ల పరిస్థితి చేయి దాటి పోయే అవకాశం ఉంది.
ముద్రగడ జైల్లో దీక్ష కొనసాగిస్తే, పరిస్థితి మరింత ముదురుతుందనే అభిప్రాయం ప్రభుత్వానికి ఉండవచ్చు. ముందు ఆయనతో దీక్షను విరమింపజేసిన తరువాతే అరెస్టు చేయడం మంచిదన్న ఆలోచనతో పోలీసులున్నారు. అందువల్ల ముద్రగడ అంగీకరిస్తే తుని ఘటనపై సిబిఐకి అప్పగిస్తామని మంత్రులు చినరాజప్ప, నారాయణ ప్రకటన చేశారని అంటున్నారు. ముందు దీక్ష విరమింపజేస్తే ఆ తర్వాత తదుపరి పరిణామాలను ఎదుర్కోవచ్చుననేది ప్రభుత్వ ఎత్తుగడగా తెలుస్తోంది.