బాబుకు 'మైనార్టీ' చిక్కు: ఎమ్మెల్యేగా ఎవరూ గెలవలేదు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గం పైన కసరత్తు చేస్తున్నారట. సీమాంధ్రలో టిడిపి అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే టిడిపి నుండి గెలిచిన 102 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా ముస్లిం మైనార్టీలు లేరు. దీంతో ఇప్పుడు మైనార్టీ శాఖ అంశం చర్చనీయాంశమైంది.
175 సభ్యులున్న సీమాంధ్ర శాసనసభలో టిడిపికి 102, బిజెపికి 4 స్థానాలు లభించాయి. విజేతల్లో ముస్లిం మైనార్టీ అభ్యర్థి ఒక్కరు కూడా లేకపోవటం చర్చనీయాంశంగా మారింది. బిజెపితో పొత్తు నేపథ్యంలో మైనార్టీ సంక్షేమ శాఖ పదవిని ఖాళీగా ఉంచడం బాబుకు ఇబ్బందులు తెచ్చి పెడుతుందని అంటున్నారు. దీంతో ఇప్పుడు ఆ శాఖ ఎవరికి అప్పగించాలనే విషయం చర్చనీయాంశమైంది.
టిడిపి ముస్లిం వర్గానికి చెందిన ఎండి ఇక్బాల్ను చిత్తూరు జిల్లా పీలేరు నుంచి బరిలోకి దించగా ఆయన ఓటమి పాలయ్యారు. గతంలో ముస్లిం మైనార్టీ మంత్రిగా వ్యవహరించిన సీనియర్ నేత ఎండి ఫరూక్ నంద్యాల లోకసభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వాస్తవానికి ఫరూక్ శాసనసభకు పోటీచేసి గెలుపొందితే తప్పనిసరిగా మంత్రి పదవి దక్కేది. అయితే ముస్లిం నేతల్లో ఒకరిని ముందుగా మంత్రివర్గంలోకి తీసుకుని తరువాత ఆరునెలల్లోపు ఎమ్మెల్సీగా ఎన్నుకోవచ్చనే అభిప్రాయాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
దీంతో ముస్లింలు అత్యధికంగా వున్న కృష్ణా, గుంటూరు జిల్లాల టిడిపి ముస్లిం నేతలు అప్పుడే తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారట. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సీనియర్ నేత కె నాగుల్ మీరా సీటు విషయమై ముందస్తు హామీ లభించడంతో ఆయన ఇంచార్జిగా గత ఐదేళ్లుగా పార్టీని నడిపారు. 1999 ఎన్నికల్లో స్వల్ప తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి జలీల్ఖాన్ చేతిలో ఓటమి పాలయ్యారు.
నాగుల్మీరా గత ఎన్నికల్లో మళ్లీ సీటు ఆశించగా ఆఖరిక్షణంలో కాంగ్రెస్ నుంచి వలసవచ్చిన మాజీ మంత్రి ఎంకె బేగ్కు పోటీ చేసే అవకాశం లభించినా ఆయన గెలవలేదు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఆఖరి క్షణాన బిజెపితో కుదిరిన పొత్తు వల్ల ఈ సీటు ఆ పార్టీకి వెళ్లినా అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఓడిపోయారు. ఎన్నికల సమయంలో తీవ్ర నిరాశా నిస్పృహలకు గురైన నాగుల్ మీరాకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దివంగత మాజీ ఎంపీ లాల్జాన్ బాషా సోదరుడు జియావుద్దీన్కు కూడా రేసులో ఉన్నారు. మహ్మద్ జానీ రెండు దఫాలు ఎన్నికై మంత్రిగా కూడా పని చేశారు. జియావుద్దీన్ నాలుగుసార్లు పోటీ చేసి రెండుసార్లు గెలిచారు. 1983లో తెదేపా తరపున బుడేఖాన్ 42వేల ఓట్ల భారీ ఆధిక్యతతో గెలిచారు. దీంతో ముస్లిం నేతకు మంత్రి పదవి కోసం అప్పుడే ఈ రెండు జిల్లాలకు చెందిన ముస్లిం నేతలు బాబుపై ఒత్తిడి తెస్తున్నారు.