పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న, డిఫెన్స్లో బాబు: రాజీయత్నం, ఢిల్లీనుంచి ఒత్తిడి?
హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతి భూసేకరణ విషయంలో జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్ర స్పందన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ డిఫెన్స్లో పడినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. మూడు రోజుల క్రితం రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటించారు.
గంటకు అటు ఇటుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. పూర్తి స్పష్టతతో మాట్లాడినట్లుగా కనిపించిందని గుర్తు చేస్తున్నారు. టిడిపి నేతలకు సూటి ప్రశ్నలు వేశారు. దీంతో, భూసేకరణ విషయంలో పవన్ కళ్యాణ్ ప్రశ్నలతో టిడిపి ఉక్కిరిబిక్కిరై, డిఫెన్స్లో పడిందని అంటున్నారు.
భూసేకరణ అంశం టీడీపీ, జనసేన మధ్య భారీ అగాథంగానే కనిపిస్తోందని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్.. టీడీపీ ఎంపీలు, మంత్రులపై దూకుడుగా విమర్శలు చేయడంతో టీడీపీ ఆత్మసంరక్షణలో పడిందంటున్నారు. టీడీపీ ఎంపీలు కేశినేని నాని, మురళీమోహన్, మంత్రులు రావెల కిశోర్ బాబు, పల్లె రఘునాథ్ రెడ్డి, పత్తిపాటి పుల్లారావులపై వ్యక్తిగత ఆరోపణలకు దిగడానికి పవన్ కళ్యాణ్ ఆలోచించలేదు.

దీంతో, డిఫెన్స్లో పడిన టిడిపి ఆయన విషయంలో రాయబారానికి సిద్ధమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ను మచ్చిక చేసుకొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
రైతుల ఇష్టం లేకుంటా భూసేకరణ చేస్తే ధర్నాకు దిగుతానని, మిత్రపక్షమైనంత మాత్రాన మీకు బానిసను కాదని ఘాటుగా స్పందించడంతో.... టిడిపి నేతలకు చంద్రబాబు సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. సంయమనం పాటించాలని చెప్పారని అంటున్నారు. పాజిటివ్గా తీసుకుంటామని చెప్పాలని సూచించారని సమాచారం.
పవన్ కళ్యాణ్ మాటల దాడితో పలువురు నేతలు లోపల రగిలిపోతున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మురళీ మోహన్ సహా పలువురు స్పందించారు. అభివృద్ధికి పవన్ కళ్యాణ్ సహకరించాలని టిడిపి మంత్రులు కోరారు. అంతే తప్ప ఘాటుగా స్పందించలేదు. అందుకు డిఫెన్స్లో పడటమే కారణమంటున్నారు.
భూసేకరణపై పవన్ కళ్యాణ్ తీరు ఏపీ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారిన నేపథ్యంలో ఆయనను చంద్రబాబు మచ్చిక చేసుకునేందుకు పావులు కదుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. భూసేకరణ విషయంలో సహకరించాలని లాబీయింగ్ కూడా చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ నుంచి కూడా ఒత్తిడి చేయిస్తున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications