పొద్దుతిరుగుడు పూలతో జాగ్రత్త: జగన్ పార్టీ వలసలపై పయ్యావుల సంచలనం
అనంతపురం: తమ పార్టీలో ఇతర పార్టీలు, ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు పెరుగుతుండటంపై తెలుగుదేశం పార్ట సీనియర్ నేత, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వలస వస్తున్న నేతలందరూ పొద్దుతిరుగుడు పువ్వులేనని అభివర్ణించారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సోమవారం జరిగిన మినీ మహానాడులో మాట్లాడిన సందర్భంగా పయ్యావుల ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం పొద్దుతిరుగుడు పువ్వుల్లాంటి కొందరు రాజకీయ నేతలు వస్తుంటారని, వారి పట్ల పార్టీ పెద్దలు అప్రమత్తంగా ఉండాలని పయ్యావుల సూచించారు.
అధికారం ఎక్కడుంటే అక్కడికి చేరేవారు కొందరు ఉంటారని.. పార్టీ ఫిరాయింపుదారులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి నాయకులతో టీడీపీకి కూడా ఇబ్బందులు రావొచ్చని ఆయన పరోక్షంగా అధిష్టానాన్ని హెచ్చరించారు.
కాగా, పయ్యావుల ప్రసంగిస్తున్నంత సేపు వేదికపైనే ఉన్న కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా.. ఆ తర్వాత సమావేశం ముగియకముందే అక్కడి నుంచి నిష్క్రమించారు. చాంద్ బాషా.. ఇటీవలే వైయస్స్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
టిడిపిలోకి కొనసాగుతున్న వలసలు
విజయవాడ: నెల్లూరు జిల్లా గూడూరు నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు పెద్దయెత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడలోని ముఖ్యమంత్రి నివాసం వద్ద మంత్రి నారాయణ, గూడూరు ఎమ్మెల్యే సునీల్కుమార్ ఆధ్వర్యంలో 30 మందికి పైగా సర్పంచులు, ఎంపీటీసీలు టిడిపిలో చేరారు.