అమరావతికి కొత్త విధానం, తక్కువ ఉండాలని బాబుకు చెప్పాం: జవదేకర్
న్యూఢిల్లీ/హైదరాబాద్: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి అటవీ భూములు డీనోటిఫై చేసిన విషయమై కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం నాడు ఢిల్లీలో స్పందించారు. తాము అటవీ భూములను పరిరక్షిస్తామని చెప్పారు. అన్నింటిని అధ్యయనం చేశాకే తాము అనుమతులు ఇచ్చామని చెప్పారు.
అనుమతుల విషయంలో ఎలాంటి జాప్యం లేదని చెప్పారు. అమరావతి నిర్మాణానికి అధ్యయనం చేయకుండానే అనుమతులు ఇచ్చామన్నది అవాస్తవమన్నారు. అమరావతి నిర్మాణానికి కొత్త విధానం తీసుకొచ్చామని, అటవీ భూముల్లోనూ నివాస, వాణిజ్య సముదాయాల నిర్మాణానికి అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు.
రాజధాని నిర్మాణానికి పూర్తి అనుమతులు వస్తాయన్నారు. రాజధాని నిర్మాణానికి అటవీ భూములు తక్కువగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అడవులను పరిరక్షించేలా రాజధాని నిర్మాణం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించారు. రాజధాని నిర్మాణంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే అటవీ భూముల డీనోటిఫై పైన ప్రశ్నిస్తున్నారు. దీనిపై కేంద్రమంత్రి స్పందించారు.
గవర్నర్తో సీఎం చంద్రబాబు భేటీ
గవర్నర్ నరసింహన్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం రాజ్ భవన్లో కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై గవర్నర్తో ఆయన చర్చించినట్లుగా తెలుస్తోంది. అదే విధంగా గవర్నర్కు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
ఐదు రాష్ట్రాల్లో మాకు జరిగిన అన్యాయం వివరిస్తాం: రఘువీరా
ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి జరిగిన అన్యాయంపై అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తామని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. అప్పుడు పదేళ్లు హోదా అన్న వాళ్లు ఇఫ్పుడు నోరు మెదపడం లేదన్నారు.