రాజ్యసభ: ఒక్కొక్కరికి 47, కెకెకు కాంగ్రెసు ఓట్లు లేనట్లే!

కాంగ్రెసు పార్టీకి చెందిన ఓట్లను పార్టీ అభ్యర్థులు కెవిపి రామచంద్ర రావు, టి సుబ్బి రామి రెడ్డి, ఎంఏ ఖాన్లకు ఒక్కొక్కరికి 47 చొప్పున కేటాయించారు. ఇప్పటి వరకు కాంగ్రెసులో మిగిలిన ఓట్లు కెకెకు వేస్తారని భావించినప్పటికీ కాంగ్రెసు దానికి చెక్ చెప్పింది. దీంతో కాంగ్రెసు ఓట్లు కెకెకు పడే అవకాశం లేదు. దీనిపై తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలో గోల్కోండ హోటల్లో చర్చిస్తున్నారు. 37 ఓట్లు వేస్తే అభ్యర్థి గెలుస్తారు. మిగులు ఓట్లపై నిర్ణయం తీసుకోనున్నారు.
కనీసం రెండో ప్రాధాన్యత ఓటును కెకెకు వేసే విషయమై సమాలోచనలు చేస్తున్నారు. అధిష్టానం అనుమతి కోసం వారు చూస్తున్నారు. ఆదాల తప్పుకోవడంతో రాజ్యసభ ఎన్నికలు కేవలం నామమాత్రమే అవుతున్నాయి. మరోవైపు తెలుగుదేశం తమ పార్టీ అభ్యర్థులు గరికపాటి మోహన రావు, సీతారామలక్ష్మిలకు 37 ఓట్ల చొప్పున కేటాయించింది.
తొలుత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిక ఓటేస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే హన్మంతు షిండే గురువారం యూ టర్న్ తీసుకున్నారు. తాను తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కె కేశవ రావుకు ఓటు వేస్తానని తెలిపారు. తాను తెరాస అభ్యర్థికి ఓటేశానని గంగుల కమలాకర్ చెప్పారు.
కాగా, రాజ్యసభ ఎన్నికల్లో సభాపతి నాదెండ్ల మనోహర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పన్నెండుమంది తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యులు కూడా వినియోగించుకున్నారు.












Click it and Unblock the Notifications