ఖమ్మంలో 30 అడుగుల కాల్వలో పడిన బస్సు, 10మంది మృతి, డ్రైవర్ పరారీ
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని నాయకన్ గూడెం వద్ద ఆదివారం అర్ధరాత్రి (తెల్లారితే సోమవారం) ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందారు. పంతొమ్మిది మందిదాకా గాయపడ్డారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఇన్ఫాల్ రెగ్యులేటర్ పైనుంచి కాలువలోకి ఓ ప్రయివేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.
ఆ బస్సు హైదరాబాద్ నుంచి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ వెళ్తోంది. బస్సు ముప్పై అడుగుల పైనుంచి పడిపోవడంతో 10 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఆరు మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను మూడు అంబులెన్స్లలో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
కలెక్టర్, ఎస్పీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఖమ్మం జిల్లా ప్రమాదం పైన తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై తెలంగాణ కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్తో మాట్లాడారు. వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. బస్సు కెపాసిటీ 36. అందులో ప్రయాణిస్తున్న వారు 29 నుంచి 30 మంది దాకా ఉన్నారు.
యాత్రాజీని బస్సు మియాపూర్ నుంచి ఆదివారం రాత్రి పదకొండున్నర గంటలకు బయలుదేరింది. అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో నాయక్ గూడెం చేరుకోగానే అదుపుతప్పి ఎడమ కాలువ వంతెన పై నుంచి బోల్తా పడింది.
డ్రైవర్ తప్పిదం వల్లే
బస్సు డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటన అనంతరం డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఎక్కువ మంది తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారు ఉన్నారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు రూ.3 లక్షల పరిహారం ప్రకటించారు.
కలెక్టర్, డీఎస్పీ
నాయకన్ గూడెం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఖమ్మం జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్, ఎస్పీ షాన్వాజ్ ఖాసీం పరామర్శించారు. గాయపడ్డ వారిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో..
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రకాశం జిల్లా మర్కాపురానికి చెందిన అజారుద్దీన్ (35) చికిత్స పొందుతూ మృతి చెందారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్, ఎస్పీ వైద్యులను ఆదేశించారు.
2 క్రేన్ల సాయంతో
బస్సు పడిన కాల్వలో నాలుగు అడుగుల మేర నీళ్లు ఉండటంతో 2 క్రేన్ల సాయంతో బస్సును బయటకు తీసేందుకు ప్రయత్నించారు.
బస్సు ఎవరి పేరిట అంటే..
నెల్లూరుకు చెందిన జనార్ధన్ రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ అయిన ఈ బస్సు నెంబర్ ఏపీ 26 టీసీ9512. బస్సు ప్రమాదం నేపథ్యంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.