అందుకే సింగపూర్ వెళ్లా: బాబు, 3ప్లాన్లు ఇచ్చాం: ఈశ్వరన్, పుష్కరాల థ్యాంక్స్
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సీడ్ కేపిటల్ ప్రణాళికను సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తాను సీఎం కాగానే సింగపూర్ వెళ్లానని చెప్పారు.
బృహత్ ప్రణాళికను మూడు దశల్లో అనుకున్న సమయానికి సింగపూర్ అందించిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకే తాను ముఖ్యమంత్రిని కాగానే సింగపూర్ వెళ్లానని చెప్పారు. పవిత్ర పుష్కరాల సమయంలో బృహత్ ప్రణాళిక (సీడ్ కేపిటల్) ఇవ్వడం శుభశూచకమన్నారు.
ఈ రోజు మనమంతా కలిసి రాజధానిని నిర్మించుకోవాల్సి ఉందని చెప్పారు. ప్రపంచం మొత్తం మన రాజధాని గురించి మాట్లాడుకునేలా చేయాలన్నారు. బృహత్ ప్రణాళిక రూపొందించిన 30 మందితో కూడిన బృందానికి చంద్రబాబు అభినందనలు తెలిపారు.
రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. దేశంలోనే ఉత్తమ నగరంగా అమరావతిని నిర్మిస్తామన్నారు. రైతులు ప్రభుత్వం పైన, తన పైన నమ్మకంతో 30వేలకు పైగా ఎకరాలు ఇచ్చారన్నారు. కేంద్రం కూడా 40వేల ఎకరాలను డీఫారెస్ట్ చేసి ఇచ్చిందన్నారు.
సీడ్ కేపిటల్లో 3 లక్షల మంది ప్రజలు ఉంటారన్నారు. ప్రపంచం మొత్తం మనం కట్టుకునే రాజధాని గురించి చర్చించుకోవాలన్నారు. రాజధాని ముఖ్య ప్రాంతంలో రెండు వైపులా వాటర్ ఫ్రంట్లు ఉంటాయని చెప్పారు. అక్టోబర్ 22న రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన ఉంటుందని చెప్పారు.
ఆర్థిక వ్యవస్థకు ప్రాణంగా నిలిచేలా, 40 లక్షళ మంది అవసరాలకు అనుగుణంగా రాజధాని నిర్మాణం ఉంటుందని చంద్రబాబు చెప్పారు. పుష్కరాల సమయంలో ఇచ్చిన ఈ అమరావతి బృహత్ ప్రణాళిక ఇచ్చారని, ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలని తాను గోదావరి తల్లిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.
సింగపూర్ మంత్రి ఈశ్వరన్ మాట్లాడుతూ... రాజధాని బృహత్ ప్రణాళికను తాము అనుకున్న సమయంలో పూర్తి చేశామని చెప్పారు. మేం మూడు రకాల ప్రణాళికలు ఇచ్చామని చెప్పారు. తమను పుష్కరాలకు ఆహ్వానించిన చంద్రబాబుకు ఈశ్వరన్ ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోను రాజధాని నిర్మాణంలో పాలు పంచుకుంటామని చెప్పారు. మా దేశ సంస్థలు, కంపెనీలు పూర్తిస్థాయి రాజధాని నిర్మాణంలో పాల్గొంటాయని చెప్పారు.