అమ్మో..మళ్లీ తుఫానా!..పుకార్లతో వణికిపోతున్న శ్రీకాకుళం జిల్లా:అప్పుడే చెప్పలేమంటున్న అధికారులు
విశాఖపట్నం:'తిత్లీ' తుఫాను ధాటికి కుదేలైపోయిన శ్రీకాకుళం జిల్లాపై కు మరో తుఫాన్ విరుచుకుపడబోతోందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఈ ప్రాంతవాసుల గుండెల్లో గుబులు రేపుతోంది.
అసలు 'తిత్లీ' దెబ్బ నుంచే ఇప్పుడప్పుడే కోలుకునే పరిస్థితి లేని తమపై మళ్లీ మరో తుఫాన్ విరుచుకుపడితే తామై పోతామోనని శ్రీకాకుళం జిల్లా వాసులు భీతిల్లిపోతున్నారు. దీంతో సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడి విద్యావంతులు కొందరు విశాఖలోని తుఫాను హెచ్చరిక కేంద్రానికి ఫోన్లు చేసి వాకబు చేస్తున్నారు. అయితే వెంటనే తుఫాన్ వచ్చే దాఖలాలు ఏమీ లేవని...అయితే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
అల్పపీడనం...ఏర్పడుతోంది
అయితే అటు వాతావరణ శాఖ అధికారులు కూడా తుఫాన్ వచ్చే అవకాశాలను పూర్తిగా కొట్టిపడేయలేకపోతుండటం గమనార్హం. వాస్తవ పరిస్థితి చూస్తే ఈ నెల 23 నాటికి ఉత్తర అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడనున్నట్లు భారత వాతావరణ శాఖ బుధవారం విడుదల చేసిన బులెటిన్లో వెల్లడించింది. అయితే ఇది తుఫాన్ కు దారి తీస్తుందనో, లేక తీయదనో ఇప్పుడే చెప్పలేమని వాతావరణ శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు.
తుఫాన్...అప్పుడే చెప్పలేం
అయితే ఇది తుఫాన్ కు దారి తీస్తుందనో, లేక తీయదనో ఇప్పుడే చెప్పలేమని వాతావరణ శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న పరిస్థితుల మేరకు అల్పపీడనం మాత్రమే ఏర్పడవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై మరింత స్పష్టత రావాలంటే మరో నాలుగు రోజులు ఆగాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ అల్పపీడనం బలపడి వాయుగుండం, ఆ తరువాత తుఫానుగా మారితే అప్పుడు మాత్రమే దాని గమనం తెలుస్తుందని...ఈలోగా దాని గురించి చెప్పలేమని వివరణ ఇస్తున్నారు.
ఈసారి వస్తే...అది 'గజ'
అల్పపీడనం ఏర్పడిన తరువాత బంగాళాఖాతంలో వాతావరణం, గాలుల తీవ్రత తదితర అంశాలపై దాని పయనం ఆధారపడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా ‘దయె' తుఫాను వస్తుందన్న వదంతులను అధికారులు కొట్టివేశారు. దయె తుఫాను గత నెలలోనే వచ్చిందని వెల్లడించారు. ఒకవేళ బంగాళాఖాతంలో ఈసారి తుఫాను వస్తే దానికి ‘గజ' అని పేరు పెట్టడం జరుగుతుందన్నారు. వదంతులు నమ్మవద్దని కోరారు.
ఆర్టీజిఎస్...ఇలా అంటోంది
ఇదిలావుండగా ఈనెల 22 లేక 23 తేదీల్లో ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడుతుందని ఆర్టీజీఎస్/ఇస్రో నిపుణుడు ప్రకటించారు. అయితే బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతులు తుఫానులకు అనుకూలంగా ఉన్నాయని విశ్లేషించారు. అయితే తుఫానులు ఇంకా ఏర్పడకముందే చెలరేగే వదంతులు,పుకార్లు నమ్మవద్దని ఆయన సూచించారు.