స్వైన్ ప్లూ: 2009తో పోలిస్తే, మరణాలు తక్కువే: నిమ్స్ డైరెక్టర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రలో స్వైన్ ప్లూ అదుపులోనే ఉందని నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్ స్పష్టం చేశారు. బుధవారం సెక్రటేరియట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో స్వైన్ ప్లూ కేసులు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. స్వైన్ ప్లూ నివారణ చర్యలు కొనసాగుతున్నాయన్నారు.
సరైన జాగ్రత్తలు పాటిస్తే స్వైన్ ప్లూ దగ్గరకు రాదని చెప్పారు. స్వైన్ ప్లూని అరికట్టడంలో మీడియా ఎంతో కృషి చేసిందన్నారు. ఆసుపత్రి వైద్యులు కూడా చాలా కష్టపడ్డారని పేర్కొన్నారు. బుధవారం ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగిందన్నారు.
స్వైన్ ప్లూ నివారణకు వైద్యులు తీసుకుంటున్న చర్యలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. 2009తో పోలీస్తే 2015లో స్వైన్ ప్లూ వ్యాధి తీవ్రత తక్కువగా ఉందన్నారు. 2009లో 10 శాతం మంది మరణిస్తే ఇప్పుడు జనవరి 1 నుంచి 27 వరకు 3.64 శాతం మంది మరణించారని తెలిపారు.
స్వైన్ ప్లూ నివారణకు తాము అశ్రద్ధ వహించడం లేదని మందులు అందుబాటులో ఉంచామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల ఆస్పత్రుల్లో స్వైన్ప్లూ మందులు ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం కూడా స్వైన్ఫ్లూ టెస్ట్ పరికరాలను రాష్ట్రానికి పంపిందని గుర్తు చేశారు.