12లోగా అసెంబ్లీకి బిల్లు: కిరణ్ పావులు, 'టి' వ్యుహాలు
గురువారం కేంద్రమంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ.. తెలంగాణ బిల్లును తాము ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రపతికి పంపిస్తామని చెప్పారు. తన వద్దకు వచ్చిన బిల్లును రాష్ట్రపతి గవర్నర్కు పంపిస్తారు. ఆ బిల్లును గవర్నర్ సభాపతికి పంపిస్తారు.
అసెంబ్లీకి బిల్లు పంపించిన అనంతరం ఎన్ని రోజుల గడువు ఇస్తారనేది ఉత్కంఠగా మారింది. గతంలో రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఆయా అసెంబ్లీలకు 45 రోజుల గడువు ఇచ్చారని, తమకు అదే సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల రాష్ట్రపతికి లేఖ రాశారు.
ఈ నెల 12వ తేదీ నుండి శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆ లోగానే బిల్లును పంపించే అవకాశాలున్నాయి. శీతాకాల సమావేశాల్లో బిల్లుపై అసెంబ్లీ తన అభిప్రాయాన్ని చెప్పే అవకాశముంది. అయితే ఎన్ని రోజుల్లో చెబుతారని విషయం సస్పెన్స్గా మారింది. అదే సమయంలో బిల్లును సీమాంధ్ర నేతలు ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
విభజన బిల్లుపై సభ్యులకు ఎంత సమయం ఇవ్వాలన్న దానిపై ఒక నిర్ణయం బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బిఏసి) తీసుకుంటుంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయమే కీలకమని భావిస్తున్నారు.
రాష్ట్రపతి తక్కువ సమయం ఇస్తే గత సంప్రదాయాల్ని అనుసరించి వీలనంత అధిక సమయం కోరుతూ లేఖ రాయాలన్న ఉద్దేశ్యంతో కిరణ్ ఉన్నారు. వీలైనంత ఆలస్యంగా చర్చ పూర్తయ్యేలా, పార్లమెంటు సమావేశాలు పూర్తయిన తర్వాతే శాసన సభలో బిల్లుపై చర్చ సారాంశం రాష్ట్రపతికి వెళ్లేలా చేద్దామన్న యోచనలో కిరణ్ తో సహా సీమాంధ్ర నేతలు ఉన్నారు. మరోవైపు త్వరగా ముగించాలని తెలంగాణ నేతలు పట్టుబడుతున్నారు.
ఈ నేపథ్యంలో బిఏసిలో ఒక అభిప్రాయానికి రాకపోతే.. ఆఖరి ప్రయత్నంగా సభలో సభాపతి దీని గురించి ప్రస్తావించి సభ్యులు, ఆయా పార్టీల శాసన సభా పక్షాల నాయకుల అభిప్రాయానికి అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు. రాష్ట్రపతి ఎంత సమయం ఇచ్చినా ఆలస్యంగా చర్చ ముగించినా, ఇప్పటికే నిర్ణయించిన శీతాకాల సమావేశాల ముగింపు గడువులోగా పార్లమెటులో దీనిని ప్రవేశపెట్టడం కష్టసాధ్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.