సీట్లకోసం బిజెపి, టిడిపి పోటాపోటీ: బరిలో నటుడు కోట!
అయితే పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారానికి భోపాల్ వెళ్లడం చర్చనీయాంశమైంది. దీంతో పొత్తు ప్రచారం ఊపందుకుంది. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో ఆయా పార్టీల ముఖ్య, మాజీ నాయకులు సీట్లపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఆశలు పెట్టుకున్న సీట్ల పైన మరో పార్టీ నాయకులు కన్ను వేస్తున్నారట.
టిడిపితో పొత్తు కుదిరితే జిల్లాలో తాము రెండు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాన్ని డిమాండ్ చేస్తామని కృష్ణా జిల్లా బిజెపి నేతలు చెబుతున్నారు. విజయవాడ సెంట్రల్ నుండి 1999లో నటుడు కోట శ్రీనివాస రావు పోటీ చేసి గెలుపొందారు. ఈ స్థానాన్ని తాము మళ్లీ కోరుతామని జిల్లా బిజెపి నేతలు చెబుతున్నారట. ఇక్కడి నుండి మళ్లీ కోట శ్రీనివాస రావునే బరిలోకి దింపాలనే యోచనలో జిల్లా నాయకులు ఉన్నారట.
కానీ, ఈ స్థానంపై తెలుగుదేశం పార్టీ ఇప్పటికే బొండా ఉమామహేశ్వర రావుకు హామీ ఇచ్చింది. ఇప్పుడు ఇతను నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్నారు. కైకలూరు కోసం ఓ నాయకురాలు బిజెపిలో చేరారు. ఇక్కడి నుండి టిడిపి ఎమ్మెల్యేగా జయమంగళ వెంకటరమణ ఉన్నారు.
పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, మాజీలు విజయవాడ పార్లమెంటు స్థానం నుండి బిజెపి తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. పొత్తు పొడిస్తే మాత్రం తాము రెండు అసెంబ్లీ, ఒక పార్లమెంటు సీటును కృష్ణా జిల్లాలో డిమాండ్ చేస్తామని జిల్లా బిజెపి అధ్యక్షులు చెబుతున్నారు. ఈ పరిస్థితి కేవలం కృష్ణా జిల్లాకే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉంది.