150సార్లు రెక్కీ, 10సార్లు ఫెయిల్, చివరికిలా!: రౌడీ షీటర్ వాసు హత్యలో సంచలనాలు..
దాదాపు 150సార్లు అతని హత్య కోసం రెక్కీ నిర్వహించి 10సార్లు హత్య చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు.
గుంటూరు: నగరంలోని అరండల్పేట 12వ లైనులో గత నెల 29న రౌడీషీటర్ బసవల వాసు దారుణ హత్యకు గురయ్యాడు. హత్య తర్వాత ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ఆదివారం మరో 12 మంది నిందితులను అరెస్టు చేశారు.
హత్యకు సంబంధించి నిందితులు చెప్పిన విషయాలు విని పోలీసులే నివ్వెరపోయారు. అరండల్పేట పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ సరిత హత్య కేసు వివరాలు తెలిపారు.
ఆధిపత్య పోరు:
గుంటూరు నగరంలోని విద్యానగర్కు చెందిన రౌడీషీటర్ బసవల వాసు గతంలో పాత గుంటూరులో ఉండేవాడు. కొంతకాలంగా ఆ ప్రాంతంలో సింగంశెట్టి సత్యనారాయణ అలియాస్ చకోడీల సతీష్ ఆధిపత్యం పెరుగుతూ వస్తోంది. దీంతో సత్యనారాయణ హవాకు చెక్ పెట్టేందుకు వాసు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి.
రోజురోజుకు వాసు తనకు అడ్డంకిగా మారుతుండటంతో అతన్ని హత్య చేసి అడ్డు తొలగించుకోవాలని సత్యనారాయణ భావించాడు. బుడంపాడుకు చెందిన రౌడీషీటర్ పేరం రామకృష్ణ, శ్రీనివాసరావుపేటకు చెందిన కలపాల ప్రతాఫ్, నక్కల దుర్గాప్రసాద్లకు కూడా వాసుతో విభేదాలు ఉండటంతో.. వారు కూడా సత్యనారాయణతో చేయి కలిపారు. అంతా కలిసి వాసు హత్యకు స్కెచ్ వేశారు.
150సార్లు రెక్కీ, 10సార్లు విఫలం:
బసవల వాసును హతమార్చడానికి సత్యనారాయణ అండ్ కో వేసిన పథకాలేవి సఫలమవ్వలేదు. 18మంది గ్యాంగ్ కలిసి దాదాపు 150సార్లు అతని హత్య కోసం రెక్కీ నిర్వహించి 10సార్లు హత్య చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. చివరగా 11వసారి అరండల్పేటలోని అన్వర్ బిర్యానీ సెంటర్ వద్ద అతనిపై దాడి చేసి హత్య చేశారు. బిర్యానీ పాయింట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో.. తొలుత అతన్ని స్కార్పియోతో ఢీకొట్టారు. ఆపై కత్తులతో అత్యంత కిరాతకంగా నడిరోడ్డుపైనే పొడిచి హత్య చేశారు.
ఎక్కడెక్కడ మాటు వేసి:
మొదటిసారిగా ఆరండల్ పేటలోని 5వ లైనులో వాసుపై హత్యాయత్నం చేసి విఫలమయ్యారు. గత ఐదు నెలలుగా అతనిని హత్య చేయడం కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. రెండోసారి పాత గుంటూరులోని సత్యనారాయణ ఇంటి వద్ద, మూడోసారి విద్యానగర్ లోని వాసు ఇంటి వద్ద, నాలుగోసారి కాకానితోట వద్ద, ఐదోసారి కాకాని రోడ్డు సమీపంలో, ఆరోసారి తల్వాకర్ జిమ్ వద్ద, ఏడోసారి నవభారత్ కాలనీలో, 8వ సారి కాకాని తోట సమీపంలో, 9వ సారి పాత గుంటూరులోని అశోక్ హోటల్ వద్ద, 10వ సారి మినర్వా హోటల్ వద్ద వాసు హత్యకు విఫలయత్నం చేశారు.
నిందితులు వీరే:
బసవల వాసు హత్య కేసులో సతీష్, సాయికృష్ణ, జిలానీ, సులేమాన్ఖాన్, రాజేష్, శివరామకృష్ణ, పేరం రామకృష్ణ, నక్కల దుర్గా ప్రసాద్, కలపాల ప్రతాఫ్, హుస్సేన్, రంజిత్కుమార్, తిర్లిక దుర్గాప్రసాద్, జొన్నకూటి సుకేష్, యలవర్తి చెన్నకేశ్వరరావు, తోట వంశీ, మహ్మద్ షాజిద్, కారుమూరి నాగబాబు, కనపర్తి ప్రశాంత్లు నిందితులుగా ఉన్నారు.
కేసులో తొలుత చకోడీల సతీష్, సాయికృష్ణ, జిలానీ, సులేమాన్ఖాన్, రాజేష్, శివరామకృష్ణలను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం బుడంపాడు వద్ద మరో 12మందిని అరెస్టు చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.