పండుగలా జరిగిన విశాఖ ఉత్సవ్...ఘనంగా ముగింపు వేడుకలు
విశాఖపట్టణం: స్టీల్ సిటీలో మూడు రోజులపాటు కన్నుల పండుగగా జరిగిన విశాఖ ఉత్సవ్ ఘనంగా ముగిసింది. ఒకవైపు సాగర ఘోష, మరో వైపు ఉత్సవ శోభ...నడుమ ప్రత్యేక కార్యక్రమాల సందడి...వెరసి మూడు రోజుల పాగు విశాఖ వాసులను ఉర్రూతలూగించాయి.
విశాఖ నగరంలోని బీచ్రోడ్లో విశాఖ ఉత్సవ్ కార్నివాల్ను గురువారం స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రారంభించారు. మూడు రోజుల పాటు పండుగలా జరిగిన ఈ వేడుకల్లో లక్షలమంది పాల్గొన్నారు. ఉత్సవానికి హాజరైన ప్రముఖులు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్లవర్ షో సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మొత్తం మీద 2 లక్షల మంది సందర్శకులు ముగింపు వేడుకలకు హాజరై ఉంటారని భావిస్తున్నారు.
ప్రారంభం ఇలా...
విశాఖ ఉత్సవ్-2017 కార్యక్రమాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నివాల్, శకటాల ప్రదర్శన, జాతర, క్రీడలు అందర్ని ఆకట్టుకున్నాయి.
హలో టీం సందడి...
విశాఖ ఉత్సవ్ మొదటి రోజు వేడుకల్లో హలో సినిమా టీం సందడి చేసింది. ఈ సినిమా హీరో, అక్కినేని నాగార్జన తనయుడు అఖిల్, హీరోయిన్ కళ్యాణి, మ్యూజిక్ డైరక్టర్ అనూప్ రూబెన్స్ ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపారు.
స్పెషల్ ఎట్రాక్షన్ ఫ్లవర్ షో...
దాదాపు 5వేల రకాల పుష్పాలతో ఎంజీఎం మైదానంలో ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో చూపరులను ఆకట్టుకున్నాయి. విశాఖలోని ప్రముఖ ఆలయాల నమూనాలను సందర్శన కోసం ఇక్కడ ఏర్పాటుచేశారు. మొదటి రోజు ఉత్సవాలు నృత్యాలు, గిరిజన జాతరలతో హోరెత్తాయి. ఆటపాటలు అందరినీ అలరించాయి. ఈ ఫెస్ట్లో సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా అనేక క్రీడా పోటీలను కూడా నిర్వహించారు. పారా మోటార్, బీచ్ ఫుట్బాల్లాంటి గేమ్స్ ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో వందలాదిమంది ఔత్సాహికులు పాల్గొన్నారు. విజేతలకు మంచి బహుమతులు అందజేసి మరింత ఉత్తేజపరిచారు.
సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్...ఫైటర్ విమానం...
విశాఖ ఉత్సవ్ లో సందర్శకులంతా ఉత్సాహంగా ఎదురుచూసిన టీయూ -142 ఫైటర్ విమానాన్ని వీక్షకుల ముందుకు తీసుకువచ్చారు. టీయూ -142 ప్రదర్శించిన విన్యాసాలు పర్యాటకుల్నిఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఘనంగా ముగింపు వేడుకలు..
విశాఖలో...సముద్ర తీరంలో రెండు కిలోమీటర్ల పరిధిలోమూడు రోజుల పాటు విభిన్నకార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ, వుడా, వేడుకల నిర్వహణ సంస్థ ఈ-ఫాక్టర్స్ ఆధ్వర్యంలో జరిగిన విశాఖ ఉత్సవ్ శనివారంతో ముగిసింది. అత్యంత ఘనంగా నిర్వహించిన ముగింపు వేడుకల్లో గోదాదేవి కల్యాణం నృత్యరూపకం, షణ్ముఖప్రియ గీతాలాపన..బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్రీతమ్చక్రవర్తి లైవ్షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సుజానా చౌదరి సందేశం....
శనివారం రాత్రి జరిగిన విశాఖ ఉత్సవ్ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర భూ విజ్ఞానశాస్త్ర శాఖ మంత్రి వై.సుజనాచౌదరి మాట్లాడుతూ గత దశాబ్దంలో ఐటీ విప్లవం వస్తే...ఈ దశాబ్దంలో పర్యాటక విప్లవం సాగుతోందని...ఈ రెండు దశాబ్దాల్లోనూ విశాఖ గణనీయమైన ప్రగతి సాధించిందని అన్నారు. అనంతరం రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ పర్యాటక ఖ్యాతి ప్రపంచానికి చాటేందుకు ప్రతినెలా ఓ ప్రత్యేక కార్యక్రమంతో పర్యాటకులను అలరించనున్నట్లు చెప్పారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పితాని సత్యనారాయణ, కామినేని శ్రీనివాసరావు, కాలవ శ్రీనివాసులు, ఎంపీలు కంభంపాటి హరిబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తూర్పునౌకాదళాధిపతి కరంబీర్ సింగ్ తదితరులు ముగింపు వేడుకలకు హాజరయ్యారు.