ఢిల్లీ నుంచి ఏపీ ఎక్స్ప్రెస్ ప్రారంభం: రైలు కోసం విశాఖ-బెజవాడ జోన్ల పట్టు
విశాఖ/ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అమలు కానీ హామీలు ఇవ్వలేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు బుధవారం చెప్పారు. విశాఖలో ఏపీ ఎక్స్ప్రెస్ను కేంద్రమంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య మాట్లాడారు.
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు పైన సమాలోచనలు జరుగుతున్నాయని చెప్పారు. బిజెపి ఎప్పుడు కూడా అమలు కానీ హామీలు ఇవ్వలేదన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత వేర్వేరు రైళ్లు కేటాయించాలని నిర్ణయించామన్నారు. ఈ రైలుకు మూడు నెలల ముందే రిజర్వేషన్ చేసుకోవచ్చన్నారు.
కేంద్రమంత్రి సురేష్ ప్రభు మాట్లాడుతూ... ఇవాళ అందరికీ ఎంతో శుభదినమని అన్నారు. ఏపీ రెండు రాష్ట్రాలుక విడిపోయాక తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు రైళ్లు కేటాయించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రజల ఆకాంక్ష మేరకు నూతన రైలును ప్రారంభిస్తున్నామని చెప్పారు.
ఈ ఏపీ ఎక్స్ప్రెస్ రాజమండ్రి, విజయవాడ మీదుగా వెళ్లే ఈ రైలు గురువారం సాయంత్రం ఢిల్లీకి చేరుకుంటుంది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఏపీ ఎక్స్ప్రెస్ను ఢిల్లీ నుంచి బుధవారం ఉదయం రిమోట్ ద్వారా లాంఛనంగా ప్రారంభిస్తున్నారు.
రైల్ భవన్లో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అశోక గజపతిరాజు, బండారు దత్తాత్రేయ పాల్గొననున్నారు. ఈ కొత్త రైలు వారానికి మూడురోజులు తిరుగుతుంది.
అన్ని ఏసీ బోగీలే ఉండటం ఈ రైలు ప్రత్యేకత. ఐదారు నెలల క్రితమే ప్రారంభం కావల్సి ఉన్నా ప్రయాణమార్గంపై వచ్చిన విజ్ఞప్తులు, తగినన్ని బోగీలు అందుబాటులో లేకపోవడంతో ఈ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవం ఆలస్యమైంది.
మరోవైపు, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రస్తుతం నడుస్తున్న ఏపీ ఎక్స్ప్రెస్ ఇకపై తెలంగాణ ఎక్స్ప్రెస్ పేరిట కొనసాగనుంది. దీన్ని కూడా బుధవారం దిల్లీలో రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రారంభించనున్నారు. రైల్ భవన్లో జరుగనున్న ప్రారంభ కార్యక్రమానికి తెలంగాణ ఎంపీలు కూడా హాజరుకానున్నారు.
ఏపీ ఎక్స్ప్రెస్ పైన వివాదం!
ఏపీ ఎక్స్ప్రెస్ తమదంటే తమదని దక్షిణ మధ్య, ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్ల మధ్య వివాదం తలెత్తినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాదు నుంచి న్యూఢిల్లీకి రాకపోకలు సాగిస్తున్న ఏపీ ఎక్స్ప్రెస్ పేరు తెలంగాణ ఎక్స్ప్రెస్గా మారుతోంది.
దీంతో ఏపీకి కొత్తగా ఏపీ ఎక్స్ప్రెస్ను నడపనున్నట్లు మొన్నటి రైల్వే బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. దీనిని విజయవాడ నుంచి నడపనున్నట్లు నాడు ప్రకటించారు. అయితే, విశాఖ నుంచి నడిస్తే మరింత బాగుంటుందని సిఎం చంద్రబాబు సూచించారు. దీంతో రైల్వే శాఖ విశాఖ వరకు పొడిగించింది.
విజయవాడ రైల్వే డివిజన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉండగా, విశాఖపట్నం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో ఉంది. దీంతో, వివాదం తలెత్తింది. బడ్జెట్లో ఏపీ ఎక్స్ప్రెస్ను కేంద్రం ప్రకటించిన వెంటనే బోగీలన్ని విజయవాడకు చేరుకున్నాయి. వాటి పర్యవేక్షణ మొత్తాన్ని సౌత్ సెంట్రల్ జోన్ చూసుకుంది.
ఈ రైలు ఇటీవలే కొద్దిరోజుల క్రితం విశాఖకు చేరింది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఈ రైలుకు గార్డు బాధ్యతలపై రెండు జోన్లకు చెందిన అధికారులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు.
విశాఖ నుంచి నడుస్తున్న ఈ రైలు బాధ్యత తమదేనని ఈస్ట్ కోస్ట్ జోన్ అధికారులు చెబుతుండగా, కేవలం 17 కిలో మీటర్ల పరిధి మాత్రమే ఈస్ట్ కోస్ట్లో ఉందని, మిగిలిన ప్రాంతమంతా తమ పరిధిలోకే వస్తుందని వాదిస్తున్న సౌత్ సెంట్రల్ అధికారులు తమ గార్డునే రంగంలోకి దించుతామని ప్రకటించారు.