వోల్వో బస్సులో మంటలు: బస్సును వెంబడించి డ్రైవర్ను అప్రమత్తం
మెదక్: మెదక్ జిల్లాలోని జహీరాబాద్ మండలం చిరాగ్పల్లి దగ్గర ఓ వోల్వో బస్సులో మంటలు చెలరేగాయి. ఆదివారం నాడు సాయంత్రం పుణె నుంచి హైదరాబాద్ వస్తున్న జేబీఆర్ ట్రావెల్స్ వోల్వో బస్సులో సోమవారం ఉదయం ఆరు గంటలకు చిరాగ్పల్లి వద్ద ఒక్కసారిగా ఇంజిన్లో మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి.
దీన్ని గుర్తించిన నేషనల్ హైవే సిబ్బంది వెంటనే బస్సును వెంబడించి డ్రైవర్ను అప్రమత్తం చేశారు. దీంతో డ్రైవర్ బస్సును ఆపి ప్రయాణికులను సురక్షితంగా దించివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారు. మంటలకు బస్సు పూర్తి దగ్ధమైంది.
రోడ్డు ప్రమాదంలోఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడిన సంఘటన ఆదివారం వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. హన్మకొండ - హైదరాబాద్ జాతీయ రహదారిపై టాటా సుమో, ట్రావెలర్ వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలతో పాటు వారి కూతురు దుర్మరణం పాలైంది.
హన్మకొండ నక్కలగుట్ట లోని పోస్టల్ కాలనీకి చెందిన ఎన్పీడీసీఎల్ సీనియర్ అసిస్టెంట్ నెల్లుట్ల రవీందర్ రెడ్డి (52), భార్య అనురాధ (45), కుమార్తె నీతిక (22)లతో కలిసి టాటాసుమోలో యాదగిరిగుట్టకు బయలు దేరారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి తాడ్వాయి మండలం మేడారానికి వెళుతున్న ట్రావెలర్ వ్యాన్ను వెంకటాయపాలెం రోడ్డు వద్ద వీరి వాహనం ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన అనురాధ, నీతికలు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. గాయపడిన రవీందర్ రెడ్డి, డ్రైవర్ రాజు, భువనేశ్వరిలను 108అంబులెన్స్లో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. యశోదలో చికిత్స పొందుతూ రవీందర్ రెడ్డి కూడా మృతి చెందారు.