జగన్కు తెలివి లేక: కేసీఆర్తో ఎర్రబెల్లి తీవ్ర వాగ్వాదం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావుల మధ్య బుధవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతర ఇరుసభలు వాయిదా పడ్డాయి. అనంతరం బీఏసీ సమావేశమైంది.
బడ్జెట్ ప్రసంగం పైన మాట్లాడేందుకు ఒక్కరికే అవకాశం ఇస్తామని కేసీఆర్ చెప్పారు. దానికి ఎర్రబెల్లి స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ వారికి ఇచ్చినట్లు తమకు కూడా ఇద్దరికి ఇవ్వాలని కోరారు. టీడీపీ నుండి ఒక్కరికే మాట్లాడే అవకాశం ఇస్తామని కేసీఆర్ మరోసారి చెప్పారు.
అయితే, ఇద్దరికి అవకాశం ఇస్తామని చెప్పి, ఒక్కరికే ఇవ్వడం సరికాదని ఎర్రబెల్లి అన్నారు. దానికి కేసీఆర్ స్పందిస్తూ.. మీరు మాట తప్పుతున్నారన్నారు. దీనిపై ఎర్రబెల్లి తీవ్రంగా స్పందించారు. మీది నోరా లేక మోరా అంటూ మండిపడ్డారు. నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కేసీఆర్ హెచ్చరించారు.
ఇద్దరికి ఇవ్వాల్సిందేనని ఎర్రబెల్లి, ఒక్కరికేనని కేసీఆర్ కాసేపు వాదించుకున్నారు. గతంలో తెరాస ఎమ్మెల్యేలు 10 మంది ఉంటే ఇద్దరే సభకు వచ్చారని ఎర్రబెల్లి అన్నారు. ఈ సమయంలో జానారెడ్డి, కే లక్ష్మణ్లు జోక్యం చేసుకున్నారు. టీడీపీలో ఇద్దరికి ఇవ్వాలని కోరారు. దానికి కేసీఆర్ స్పందిస్తూ.. ఎందరికి ఇవ్వాలో అంతమందికే ఇస్తామని చెప్పారు. దీంతో ఎర్రబెల్లి స్పందిస్తూ.. మీ దయాదాక్షిణ్యాలు మాకు అవసరం లేదన్నారు.
కేసీఆర్ స్పందిస్తూ.. బీఏసీ ఇష్టం లేకుంటే ఏపీలో జగన్లా బయటకు వెళ్లవచ్చునని వ్యాఖ్యానించారు. జగన్కు తెలివితేటలు లేకే అలా చేశారని, తాము అలా చేయమని ఎర్రబెల్లి అన్నారు. సమావేశాలు ముప్పై రోజులు పొడిగించాలని టీడీపీ డిమాండ్ చేస్తే.. బడ్జెట్ వినే ఓపికే లేని మీకు ఎన్ని రోజులు చర్చ సాగితే ఏంటని కేసీఆర్ ప్రశ్నించారు.
నవంబర్ 22 వరకు సమావేశాలు
నవంబర్ 22వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయి. మొదటి నాలుగు రోజులు బడ్జెట్ పైన చర్చ సాగుతుంది. 13 నుండి 22వ తేదీ వరకు పద్దుల పైన చర్చ సాగుతుంది. 8, 9, 16 తేదీల్లో సెలవులు ఉన్నాయి. సభ పొడిగింపుపై మరోసారి సమావేశం కానున్నారు. నాలుగు రోజులు పొడిగించే అవకాశముంది. నవంబర్ 22 వరకు మండలి సమావేశాలు జరుగుతాయి. 17-20 నరకు సెలవులు మండలికి సెలవులు ఉన్నాయి.
బడ్జెట్ పైన ఈటెల
తమ బడ్జెట్ ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం ఈటెల విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బడ్జెట్ అంటే లెక్కల పట్టిక, లాభనష్టాల పట్టిక కాదన్నారు. సంక్షేమ రంగానికి తాము పెద్దపీట వేశామన్నారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు.
గతం కంటే ప్రతి రంగంలోని నిధుల కేటాయింపు పెంచామని చెప్పారు. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు ఇవ్వాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. జిల్లా కేంద్రాల్లో స్పెషాలిటీ ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా మారుస్తామన్నారు. పౌల్ట్రీ పరిశ్రమకు వ్యవసాయ హోదా కల్పించామన్నారు.
బంగారు తెలంగాణ నిర్మాణం ధ్యేయంగానే బడ్జెట్ ప్రవేశ పెట్టామన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలన్న కల అమలైందన్నారు. 57 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం కూడా మైనార్టీలకు తాము కేటాయించినంత ఇవ్వలేదన్నారు. సమైక్య రాష్ట్రంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని చెప్పారు. అంతకుముందు హరీష్ రావు మాట్లాడుతూ.. నయా పైస ఇవ్వమన్న చోట తామే బడ్జెట్ ప్రవేశ పెడుతున్నామన్నారు.