ఉద్దేశం అది కాదు: శేషాచలం ఎన్కౌంటర్పై హోం మంత్రి, తమిళ నేతలదే తప్పని బొజ్జల
కాకినాడ చిత్తూరు: చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లను ఎన్కౌంటర్ చేయడం తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి చిన్న రాజప్ప అన్నారు. శనివారంనాడు ఆయన తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడారు.
గత ఆరు నెలలుగా ఎర్రచందనం స్మగ్లర్లకు హెచ్చరికలు చేస్తూనే ఉన్నామని, విధిలేని పరిస్థితిలోనే ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు. గతంలో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ను పట్టుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఎదురుకుందని ఆయన గుర్తు చేశారు.
20 మంది ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్ నేపథ్యంలో అటు తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడిన సంక్షోభాన్ని నివారించే చర్యలు చేపడుతామని ఆయన చెప్పారు. చర్చల ద్వారా ఇరు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలను పునరుద్ధరిస్తామని ఆయన చెప్పారు.
తమిళులపై తమకు ఎంతో గౌరవం ఉందని రాష్ట్ర అటవీ శాఖమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. అందుకే తాము తెలుగుగంగ నీటిని తమిళనాడుకు ఇస్తున్నామని ఆయన శనివారంనాడు చిత్తూరులో అన్నారు.
అడవులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. తమిళ రాజకీయ నేతలో సంఘటనపై వివాదం సృష్టిస్తున్నారని ఆయన అన్నారు.