ప్రభుత్వ వ్యతిరేకుల్ని గుర్తించడానికేనా గ్రూప్-1లో ఆ ప్రశ్న!?
విజయవాడ : కేంద్రం నుంచి ఇక ప్రత్యేక హోదాను ఆశించడం కష్టమే అన్న అభిప్రాయం ఇప్పటికే చాలామంది ప్రజల్లో నెలకొంది. దీనికి తగ్గట్లు టీడీపీ ప్రభుత్వం కూడా కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ వైపే మొగ్గు చూపుతోంది. వైసీపీ, కాంగ్రెస్ లు మిగతా విపక్షాలు హోదా గురించి నిలదీయడం తప్పించి.. టీడీపీ ప్రభుత్వ ఒత్తిడి లేకుండా అదంతా అయ్యే పనేనా?
ఇదంతా పక్కనబెడితే.. జనం మదిలో ఏముందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆరాటపడే సీఎం చంద్రబాబు, తాజాగా గ్రూప్-1 పరీక్షను ఇందుకు వేదికగా చేసుకోవడం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. బుధవారం నాడు జరిగిన గ్రూప్-1 మెయిన్ పరీక్షలో.. ప్యాకేజీతో పోల్చితే హోదాతో ఎక్కువ ప్రయోజనాలుంటాయా? దీని గురించి సంక్షిప్తంగా వివరించండి అంటూ ప్రశ్నాపత్రంలో హోదా విషయాన్ని ప్రస్తావించడంతో.. ప్రస్తుతం దీనిపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాగా, 2011 గ్రూప్1 మెయిన్స్ పరీక్షలను బుధవారం నాడు నిర్వహించింది ఏపీపీఎస్సీ.
ప్రశ్న అయితే అడిగారు గానీ.. ప్యాకేజీ కంటే హోదానే బెటర్ అనేవాళ్లకు మార్కులు పడుతాయా? లేదా? అన్నది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించడానికి రెడీ అయిన నేపథ్యంలో.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సమాధానం రాస్తే.. మార్కులు వేస్తారా? వేయరా? అన్నది తేలాల్సి ఉంది. ఒకవిధంగా ఈ ప్రశ్న ద్వారా ప్రభుత్వ అనుకూలురు ఎవరు..? వ్యతిరేకిస్తున్నదెవరు? అన్నది తేల్చడానికే పరీక్షలో ఇలాంటి ప్రశ్నను ఇచ్చారన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.