రెండేళ్లుగా ఇదే రీలు: బాబుపై జగన్ సెటైర్, 'బాగా దీర్ఘాలు తీశారు కానీ..'
హైదరాబాద్: రెండేళ్లుగా చంద్రబాబు ఇదే రీలు చదువుతున్నారని వైసిపి అధినేత జగన్ ఎద్దేవా చేశారు. విభజన హామీలు కోరుతూ చంద్రబాబు సభలో తీర్మానం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై జగన్ స్పందించారు. మనం ఇలా తీర్మానం చేసి పంపడం రెండోసారి అనుకుంటానని అన్నారు.
హామీలు అమలు చేస్తారా లేదా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటానని చంద్రబాబు ఎందుకు అల్టిమేటం జారీ చేయడం లేదన్నారు. ఆయన చేస్తాడు.. చేస్తాడు.. చేస్తాడూ.. చేస్తూనే ఉంటాడు అని జగన్ ఎద్దేవా చేశారు. రెండేళ్లుగా అదిగో, ఇదిగో అని ఎదురు చూస్తున్నామన్నారు. చిత్తశుద్ధి ఉండాలన్నారు.
ఈ తీర్మానంతో పాటు మద్దతు ఉపసంహరించుకుంటామని అల్టిమేటం జారీ చేస్తారా అని జగన్ సవాల్ చేశారు. ఇక్కడ బీద ఏడుపులు ఏడుస్తూ, అక్కడ (ఢిల్లీ) బిజెపి నేతలను పొగుడుతారని ఎద్దేవా చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలతో పాటు ప్రత్యేక ప్యాకేజీలో ప్రకాశం జిల్లాను చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
మంత్రి కామినేని శ్రీనివాస రావు మాట్లాడుతూ.. బిజెపి, టిడిపి పొత్తు చెడగొట్టడమే జగన్ ఉద్దేశ్యమా అని ప్రశ్నించారు. ఎంతసేపు విమర్శలే కానీ సూచనలు చేయరా అని ప్రశ్నించారు.
బిజెపి సభ్యుడు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ... జగన్ బాగా దీర్ఘాలు తీశారని ఎద్దేవా చేశారు. స్వాతంత్రం వచ్చాక ఏ రాష్ట్రానికి కూడా ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీకి చేసిన సాయం చేయలేదన్నారు. మన రాష్ట్రం నుంచి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఉన్నారని, ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారని అభిప్రాయపడ్డారు.
పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించామన్నారు. ఏపీకి కేంద్రం నుంచి సాయానికి పార్టీలకతీతంగా పని చేయాలన్నారు.