కమీషన్లు వేస్తున్నారే గానీ...: ప్రమాద స్థలిలో జగన్
అనంతపురం: రైలు ప్రమాదాలు, వోల్వో బస్సు ప్రమాదాలు జరిగిన తర్వాత కమీషన్లు వేస్తున్నారు గానీ ఫలితం ఉండడం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అననారు. నాందేడ్ - బెంగళూర్ ఎక్స్ప్రైస్ ప్రమాదానికి గురైన స్థలాన్ని ఆయన శనివారంనాడు సందర్శించి, బాధితులను పరామర్శించారు. పుట్టపర్తి రైల్వే స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
16 నెలల వ్యవధిలో మూడు రైలు ప్రమాదాలు జరిగాయని, అనేక మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారని, పలువురు గాయపడ్డారని, ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం విచారణకు కమీషన్లను వేస్తోందని, అయినా ఫలితం కనిపించడం లేదని ఆయన అన్నారు.

విచారణ నివేదికలు లేవని, ప్రమాదాలు ఎలా జరిగాయో తెలియదని, వివరాలు వెల్లడించరని, మళ్లీ ఈ రోజు కూడా కమిషన్ వేస్తామంటున్నారని, సమస్య మళ్లీ తలెత్తకుండా ఏ విధమైన చర్యులూ తీసుకోవడం లేదని ఆయన అన్నారు. రైళ్లకు పాతబోగీలు వాడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని ఆయన హెచ్చరించారు.
నాలుగు వోల్వో బస్సు ప్రమాదాలు జరిగాయని, నడిరోడ్డుపై నాలుగు వోల్వో బస్సులు దగ్ఘమయ్యాయని, అనేక మంది చనిపోయారని, ప్రమాదాలకు కారణాలు మాత్రం తెలియడం లేదని ఆయన అన్నారు. ఇన్ని ప్రమాదాలు జరిగి ఇంత మంది చనిపోతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ఆయన అడిగారు. ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటే సరిపోదని ఆయన అన్నారు. ప్రజలకు భద్రత కల్పించడం ముఖ్యమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications