వైఎస్ గుర్తొస్తున్నాడు: విజయమ్మ, జగన్ పార్టీకి 4 ఏళ్లు
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పోరాటం చూస్తుంటే తనకు వైయస్ రాజశేఖర రెడ్డి గుర్తుకు వస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ బుధవారం అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. విజయమ్మ కేక్ కట్ చేసి అనంతరం మాట్లాడారు.
వైయస్ ఆశయ సాధనల కోసం పుట్టిన పార్టీ తమదన్నారు. వైయస్ మృతి చెందినప్పటి నుండి రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. తమ పార్టీని చూసి కాంగ్రెసు, టిడిపిలు భయపడుతున్నాయన్నారు. చంద్రబాబుకు ప్రజల ప్రయోజనాలు పట్టడం లేదని, ఆయన సొంత ప్రయోజనాలే చూసుకుంటున్నారన్నారు.
రాష్ట్ర విభజనకు చంద్రబాబు సాయం చేశారని, తాము సమైక్యం కోసం ఎన్నో పోరాటాలు చేశామన్నారు. రాష్ట్రాన్ని విడదీసినా తెలుగు వారంతా ఒక్కటే అన్నారు. ప్రజల సంక్షేమమే పరమావధిగా తమ పార్టీ ఉద్భవించిందన్నారు. వైయస్ జగన్ పోరాటం చూస్తుంటే వైయస్ గుర్తుకు వస్తున్నారన్నారు.
ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేది తమ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. అఫ్పుడు ఘనంగా పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించుకుందామని ఆమె చెప్పారు. కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్థాపించి మూడేళ్లు పూర్తి అయింది.