కిరణ్, వైఎస్ ఫోటో తొలగింపు: టిడిపిలోకి చిరు ఎమ్మెల్యే
హైదరాబాద్/కడప: సిఎల్పీ కార్యాలయంలోని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిల ఫోటోలను బుధవారం తొలగించారు. మంగళవారం మాజీ మంత్రి, కంటోన్మెంట్ సీనియర్ శాసన సభ్యుడు శంకర రావు ఆ ఫ్లెక్సీని చించివేసిన విషయం తెలిసిందే. ఈ రోజు వారి ఫోటోలను తొలగించారు.
బ్యాలట్ పద్ధతిలో డిఎల్ అభిప్రాయ సేకరణ
మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి బ్యాలెట్ పద్ధతిలో తన రాజకీయ భవిష్యత్తుపై అనుచరుల నుండి అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రంలో బ్రోకర్ వ్యవస్థ నడుస్తోందని మండిపడ్డారు. బ్రోకర్ల సాయంతో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగారని నిప్పులు చెరిగారు. ప్రజాభిప్రాయం మేరకు తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
టిడిపిలోకి తోట త్రిమూర్తులు
తూర్పు గోదావరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ శాసన సభ్యుడు తోట త్రిమూర్తులు బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తోట త్రిమూర్తులు సైకిలెక్కారు. ఆయనకు చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. త్రిమూర్తులు 2009 ఎన్నికల్లో పిఆర్పీ తరఫున గెలుపొందారు. ఆ తర్వాత ఇటీవలి ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తరఫున గెలిచారు.