జగన్పై బాబు పైచేయి: టిలో కాంగ్రెస్సే, టి-టిడిపి జోరు
హైదరాబాద్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం పార్టీ ముందంజలో కొనసాగుతోంది. తెలంగాణలో పార్టీ మసకబారలేదని నిరూపించుకుంటోంది. తెలంగాణలో కాంగ్రెసు పార్టీ తొలి స్థానంలో, తెరాస రెండో స్థానంలో ఉండగా, టిడిపి మూడో స్థానంలో కొనసాగుతోంది. సీమాంధ్రలో రెండో స్థానంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు సైకిల్కు గట్టి పోటీనిస్తోంది. కాంగ్రెసు జాడ కనిపించడం లేదు.
సాయంత్రం నాలుగున్నర గంటల వరకు తేలిన ఫలితాల ప్రకారం సీమాంధ్రలో టిడిపి 1660 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకోగా, వైయస్సార్ కాంగ్రెసు 1419, కాంగ్రెస్ 41 స్థానాల్లో గెలిచారు. జడ్పీటీసీల విషయానికొస్తే టిడిపి 4, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 1 గెలుచుకుంది. సీమాంధ్రలోని పదమూడు జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాలుగు, టిడిపి తొమ్మిది జిల్లాల్లో ఆధిక్యత కనబరుస్తోంది.
కర్నూలు, కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో జగన్ పార్టీ, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో టిడిపి ఆధిపత్యం కనిపిస్తోంది.
తెలంగాణలో మధ్యాహ్నం వరకు కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిల మధ్య పోటీ పోటీ కనిపించింది. ఆ తర్వాత కాంగ్రెసు పార్టీ క్రమంగా పుంజుకుంది. కొద్ది తేడాతో కాంగ్రెసు మొదటి స్థానంలో ఉంది. తెలంగాణలో కాంగ్రెసు 808, తెరాస 681, టిడిపి 333 ఎంపీటీసీలను గెలుచుకుంది. కాంగ్రెస్ 10, తెరాస 26, టిడిపి 1 జెడ్పీటీసీలను గెలుచుకున్నాయి. టిడిపి ఊహించని విధంగా 285 స్థానాలతో మూడో స్థానంలో ఉండటం గమనార్హం.