యాక్సిస్ బ్యాంకు సీఈఓ శిఖాశర్మ పదవీకాలం పొడిగింపుపై ఆర్భీఐ అభ్యంతరం
న్యూఢిల్లీ: యాక్సిస్ బ్యాంకు సీఈఓ శిఖాశర్మ పదవీకాలం పొడిగింపుపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో పునరాలోచన చేయాలని యాక్సిస్ బ్యాంక్ బోర్డును ఆర్బీఐ కోరింది. ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓగా ఉన్న చందాకొచ్చర్ భర్త వీడియోకాన్ కంపెనీకి ఆయాచితంగా లబ్ది చేశారనే విషయమై సిబిఐ విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలోనే యాక్సిస్ బ్యాంకు సీఈఓ శిఖా శర్మ విషయమై ఆర్బీఐ తాజాగా చేసిన ప్రస్తుతం కలకలానికి కారణంగా మారింది.
ఈ విషయమై బ్యాంకు ఛైర్మెన్ సంజీవ్ మిశ్రాకు ఆర్బీఐ లేఖ రాసిందని సమాచారం. అన్ని బ్యాంకుల ఎగ్జిక్యూటివ్ అపాయింట్మెంట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా బ్యాంకులను కోరింది. ఈ క్రమంలోనే యాక్సిస్ బ్యాంకు సీఈఓ శిఖా శర్మ పదవి కొనసాగింపుపై ఆర్బీఐ పలు సూచనలు చేసింది.
యాక్సిస్ బ్యాంకు మొండి బాకీల అంచనా లెక్కల్లో లోపాలు తలెత్తడంతో ఆర్బీఐ రూ.3 కోట్ల పెనాల్టీని కూడ విధించింది. ఈ విషయమై బ్యాంకు అధికారులు స్పందించలేదు. సీనియర్ ఎగ్జిక్యూటివ్ల నియామకాలపై బ్యాంకు బోర్డు ఒక ప్రామాణిక ప్రక్రియను అనుసరిస్తుందని ప్రకటించింది.
ఈ అంశంపై తుది నిర్ణయంపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. శిఖాశర్మ 2009లో తొలిసారిగా యాక్సిస్ బ్యాంకు సీఈఓ బాధ్యతలను చేపట్టారు. వరుసగా మూడు సార్లు ఈ పదవిలో ఉన్నారు. ఈ ఏడాది జూన్ నుండి నాలుగో దఫా సీఈఓగా ఆమె పదవీ కాలం ప్రారంభం కానుంది. మొండి బాకీల విషయంలో యాక్సిస్ బ్యాంకు సీఈఓపై విమర్శలు రావడంతో ఆర్బీఐ ఈ సూచన చేసిందని ప్రచారం కూడ లేకపోలేదు.