రాజధాని రైతులకు బేడీలపై ఎస్పీ సీరియస్- ఆరుగురు కానిస్టేబుళ్లపై వేటు, విచారణ కమిటీ
అమరావతి రాజధాని రైతులను జైలుకు తరలించే క్రమంలో వారికి బేడీలు వేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అన్నదాతలకు క్రిమినల్స్ తరహాలో బేడీలు వేయడమేంటని విపక్షాలు మండిపడ్డాయి. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
కృష్ణాయపాలెంకు చెందిన రైతులకు బేడీలు వేసి జైలుకు తరలించడంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో గుంటూరు ఎస్పీ విశాల్ గున్నీ సీరియస్ అయ్యారు. రైతులకు బేడీలు వేసిన ఘటనకు బాధ్యులైన ఆరుగురు ఎస్కార్ట్ హెడ్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు. మరికొందరికి ఛార్జి మెమో ఇచ్చారు. అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో కమిటీని కూడా ఏర్పాటు చేసి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఛార్జ్మోమో జారీ చేసిన వారిలో ఆర్ఎస్సై, ఆర్ఐ కూడా ఉన్నారు.

ఇప్పటికే అమరావతి ప్రాంత రైతులపై పోలీసుల వ్యవహారశైలి నిత్యం విమర్శలకు తావిస్తోంది. పోలీసుల తీరుపై అమరావతి ఉద్యమకారులతో పాటు విపక్షాలు కూడా మండిపడుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఆందోళన చేస్తున్న రైతులను బేడీలు వేసి మరీ బస్సులో జైలుకు తరలించారు. దీంతో ఈ ఘటన అమరావతి గ్రామాల్లో ఉండే స్ధానికుల్లో మరింత ఆగ్రహం నింపింది. రాజకీయ పార్టీల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో పోలీసులు ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించారు.












Click it and Unblock the Notifications