ఏపీలో పరీక్షల రగడ : జగన్ కంసుడే.. వారు బతికుంటే కదా భవిష్యత్తు? లోకేష్ ధ్వజం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరీక్షల నిర్వహణపై రగడ కొనసాగుతుంది. కరోనా ఉధృతి నేపధ్యంలో పరీక్షలు నిర్వహించవద్దని ప్రతిపక్ష టీడీపీ డిమాండ్ చేస్తుంటే, పరీక్షలు నిర్వహించి తీరుతామని అధికార వైసీపీ స్పష్టం చేస్తుంది. విద్యార్థులు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శిస్తుంటే , వారి భవిష్యత్ దృష్ట్యా పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వం సమాధానం చెప్తుంది. ఇక తాజాగా సర్కార్ నిర్ణయం టీడీపీ నేత నారా లోకేష్ ఆగ్రహానికి కారణం అయ్యింది .

పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల రద్దుకు జగన్ పై లోకేష్ ఒత్తిడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేయాలని, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటం మంచిది కాదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొద్దిరోజులుగా జగన్ సర్కార్ పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. అంతేకాదు గవర్నర్ కు సైతం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని లేఖ రాసిన లోకేష్, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు సైతం నిర్వహించారు.
విద్యార్థుల పాలిట వైయస్ జగన్ కంసుడు అని తేలిపోయింది
విపరీతంగా కేసులు పెరుగుతున్న సమయంలో పరీక్షలు నిర్వహించడం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటం అని, పరీక్షలు రద్దు చేసి మంచి మేనమామ అనిపించుకుంటారో .. లేదా కంస మామ అనిపించుకుంటారో జగన్ ఇష్టం అంటూ పేర్కొన్న లోకేష్, తాజాగా ఏపీ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి తీరుతామని చేసిన ప్రకటనతో మరోమారు నిప్పులు చెరిగారు.ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థుల పాలిట వైయస్ జగన్ కంసుడు అని తేలిపోయింది అంటూ ట్వీట్ చేశారు లోకేష్.
విద్యార్థుల భవిష్యత్తు అంటూ దీర్ఘాలు తీస్తున్న జగన్ రెడ్డి .. అంటూ ప్రశ్న
కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న దశలో కేంద్రం, దాదాపు అన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు,వాయిదా వేస్తే ఒక్క ఏపీ లోనే పరీక్షలు నిర్వహిస్తామని మొండిగా ముందుకు వెళ్లడం జగన్ రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనమని తీవ్రంగా మండిపడ్డారు.అంతేకాదు విద్యార్థుల భవిష్యత్తు అంటూ దీర్ఘాలు తీస్తున్న జగన్ రెడ్డి అధ్వాన పాలనలో వారు బతికి ఉంటే కదా భవిష్యత్తు? అంటూ ప్రశ్నించారు.రాష్ట్రంలో కరోనా పరిస్థితులు దారుణంగా ఉన్నాయని పేర్కొన్న లోకేష్ అంబులెన్సులు రావు, ఆక్సిజన్ లేదు, జనం పిట్టల్లా రాలిపోతున్నారు అంటూ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ పరీక్షల పేరుతో 15 లక్షల మందికి పైగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
కరోనా శవాలతో మార్చురీలు నిండిపోయాయి అని, అంత్యక్రియలకు స్మశానంలో జనాలు క్యూ కడుతున్నారని పేర్కొన్న లోకేష్ ఆసుపత్రులలో బెడ్లు దొరక్క జనాలు రోడ్డుపక్కనే కుప్పకూలిపోతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ పట్టించుకోకుండా సీఎం జగన్ పరీక్షల పేరుతో 15 లక్షల మందికి పైగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, ఫ్యాక్షన్ సీఎంకు ఇది తగదని లోకేష్ నిప్పులు చెరిగారు. అంతకుముందు కరోనా కేసులు, మరణాల విషయంలో ఇస్తున్న లెక్కలలో పారదర్శకత అవసరమని పేర్కొన్నారు.
Recommended Video

పరీక్షలు నిర్వహించి తీరతామన్న జగన్ సర్కార్ .. మండిపడుతున్న లోకేష్
సరైన డేటా ఇవ్వడం వల్ల రాష్ట్రంలో కరోనాపరిస్థితి ప్రజలకు అర్థమవుతుందని, ఎవరికివారు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి వీలవుతుందని నారా లోకేష్ పేర్కొన్నారు . ప్రభుత్వం పారదర్శకంగా కరోనా లెక్కలను ఇవ్వాల్సిన అవసరం ఉందని లోకేష్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని సర్కార్ కష్టమైనా, భారమైనా పరీక్షలు నిర్వహించి తీరుతామని తేల్చిచెప్పింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తామని చెప్పి, ప్రతిపక్షాల విమర్శలపై మండిపడ్డారు. అన్నిరాష్ట్రాల్లోనూ ఒకే పరీక్ష విధానం లేదని, కేంద్రం రాష్ట్రాలకే నిర్ణయాధికారాలను వదిలి వేసిందని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే మరోమారు నారా లోకేష్ జగన్ కంసుడే అంటూ నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications