Unstoppable: ‘అన్స్టాపబుల్’పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!
బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అన్స్టాపబుల్' టాక్ షోకు సంబంధించి అనధికార స్ట్రీమింగ్, ప్రసారాలను వెంటనే నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 'ఆహా' ఓటీటీ వేదికగాఈ షో ప్రసారమవుతోన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా 'అన్స్టాపబుల్' ఎపిసోడ్లు, ప్రోమోలను సోషల్ మీడియాద్వారా షేర్ చేస్తున్నారు.
కొన్ని ఎపిసోడ్లకు సంబంధించి షూటింగ్ జరుగుతున్న సమయంలోనే వీడియోలు, ఫొటోలు ఆన్లైన్లో పెడుతున్నారు. ఈ క్రమంలో అర్హ మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ దిల్లీ హైకోర్టులో వ్యాజ్యం వేయగా, దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ సచ్దేవ్ కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.
అనధికారికంగా 'అన్స్టాపబుల్'ను ప్రసారం చేయడం వల్ల షోపై తీవ్ర ప్రభావం చూపుతోందని, డిసెంబరు 30న అగ్ర కథానాయకుడు ప్రభాస్తో బాలకృష్ణ చేసిన ఇంటర్వ్యూ ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్తో పాటు, మిగిలిన ఎపిసోడ్లు అనధికారికంగా ప్రసారం కాకుండా ఆదేశాలు ఇవ్వాలని లాయర్ ప్రవీణ్ ఆనంద్, అమిత్ నాయక్లు కోర్టును ఆశ్రయించారు.
అనధికారిక ప్రసారాల వల్ల షో నిర్వాహకులు వాణిజ్యపరంగా నష్ట పోవాల్సి వస్తోందని, ఇలాంటి వాటిని అడ్డుకునేందుకు ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం వెబ్సైట్స్తో పాటు ఇతర మీడియా మాధ్యమాలపై చర్యలు తీసుకునేలా 'డైనమిక్ ఇంజక్షన్' ఇవ్వకపోతే ఫిర్యాదిదారుకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని కోర్టు పేర్కొంది.
అందుకే తదుపరి విచారణ వరకు మధ్యంతర ఇంజెక్షన్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు 'అన్స్టాపబుల్' షోకు సంబంధించి సోషల్ మీడియాలో ఉన్న అనధికారిక లింకులను తొలగించాలని టెలికమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వశాఖ, ఇంటర్నెట్ ప్రొవైడర్లకు ఢిల్లీ న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.