శభాష్ వీణా-వాణి: ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్లో పాసైన అవిభక్త కవలలు
హైదరాబాద్: నేడు వెలువడిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో అవిభక్త కలవలలైన వీణ వాణీలు ఫస్ట్ క్లాస్లో పాసయ్యారు. వీణ 712 మార్కులు సాధించగా.. వాణి 707 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వారిని అభినందించారు. వీణావాణీలు ప్రతిఒక్కరీకి ఆదర్శంగా నిలిచారని కొనియడారు.
భవిష్యత్తులో వీణా-వాణీలకు అవసరమైన అన్ని సదుపాయాలు అందిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. వీణా-వాణీలకు సహకారం అందించిన అధికారులను మంత్రి అభినందించారు.

మరోవైపు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సైతం వీణ-వాణిలను అభినందించారు. శిశు సంక్షేమ శాఖ కార్యాలయానికి వెళ్లి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట స్థానిక డివిజన్ కార్పొరేటర్ దేదీప్య రావు, డివిజన్ అధ్యక్షుడు కోనేరు అజయ్, కార్యదర్శి వేణు, విజయ్ ముదిరాజ్, సత్యనారాయణ, పవన్ తదితరులు ఉన్నారు.
కాగా, గతంలో వీణా వాణీలు మాట్లాడుతూ.. తాము భవిష్యత్తులో ఇంజినీర్, సైంటిస్ట్ కావాలనుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం స్టేట్హోంలో ఆశ్రయం పొందుతున్న వీరి బాగోగులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటున్న విషయం తెలిసిందే. పుట్టినప్పటి నుంచి నీలోఫర్ ఆసుపత్రిలోనే ఎక్కువ కాలం గడిపిన ఈ చిన్నారులను తర్వాత స్టేట్హోంకు తరలించారు.
కాగా, ఆపరేషన్ చేసి వీణా-వాణీలను విడదీయాలని ప్రభుత్వానికి తండ్రి మురళి గతంలోనే విజ్ఞప్తి చేశారు. అయితే, శస్త్ర చికిత్స చేసి విడదీసేందుకు వైద్య నిపుణలు సమాలోచనలు జరిపారు కానీ, ఏ ప్రయత్నాలు ముందుకు సాగలేదు.
కాగా, మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెంకు చెందిన మారగాని మురళి, నాగలక్ష్మిలకు ఈ అవిభక్త కవలలు 16 అక్టోబర్, 2006న జన్మించారు.












Click it and Unblock the Notifications