నీరా కేఫ్కు ఆ పేరు పెడతారా?: బ్రాహ్మణ సంఘాల ఫైర్, మంత్రి వివరణ ఇదే
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 'నీరా కేఫ్'కు సంబంధించిన పేరుపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నీరా కేఫ్కు వేదామృతం అనే పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
నీరా కేఫ్ పేరు మార్చాల్సిందేనంటూ బ్రాహ్మణ సంఘాలు
నీరా కేఫ్కు పెట్టిన ఈ పేరును తక్షణమే మార్చేయాలంటూ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు కేవీ రమణాచారికి బ్రాహణ సంఘం ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. వేదాలను కించపరిచేలా కల్లు కాంపౌండ్కి 'వేదామృతం' అని పేరు పెట్టారని మండిపడ్డారు. పేరు మార్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
నీరా ప్రకృతి ఔషధమంటూ శ్రీనివాస్ గౌడ్ వివరణ
ఈ వివాదంపై ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. వేదాల్లో కూడా సురాపానకం గురించి స్పష్టంగా ఉందన్నారు. కౌండిల్య మహర్షికి వరంగా వచ్చిన మూడు కల్ప వృక్షాలే తాటి, ఖర్చూర, కొబ్బరి చెట్లు అని గుర్తు చేశారు. వీటిని ప్రకృతి ఔషధాలని వేదాలు వివరించాయన్నారు. అయినా కల్లు వేరు.. నీరా వేరు అని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.
వేదాలు కులాల రహితమంటూ శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
అయినప్పటికీ.. వేదామృతం అనే పదంపై ఏమైనా వివాదం ఉంటే పరిశీలిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అంతేగాక, వేదాలు రాసింది ఒక బెస్త అని.. రామాయణం రాసింది ఒక బోయ అని.. వేదాలను కులాల రహితంగా చూడాల్సిన అవసరం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పీహెచ్డీ చేసిన కొంత మంది విద్యార్థులు వేదాలను అధ్యయనం చేసి.. వేదామృతం అనే పేరు సూచించారని మంత్రి వెల్లడించారు.
నీరా ఆరోగ్యానికి మేలే
కాగా, హైదరాబాద్ నగరంలోని నెక్లెస్రోడ్డు నీరా కేఫ్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి వేదామృతం అనే పేరు పెట్టారు. ఇప్పటికే నిర్మాణ ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలంగాణ వంటకాల స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. నీరా కల్లు కాదని.. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలంగాణ మంత్రులు ఇప్పటికే తెలిపారు. ఓ వేదికపై నీరాను పలువురు మంత్రులు తాగారు కూడా. అయితే, ఇప్పుడు నీరా కేఫ్ పేరుపై వచ్చిన వివాదంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి.