శిల్ప చౌదరీకి నో బెయిల్: రిమాండ్ విధింపు, కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్..
కిట్టీ పార్టీలు, పేకాట నిర్వహించి.. సెలబ్రిటీల నుంచి కోట్లు వసూల్ చేసిన శిల్పా చౌదరికి బెయిల్ లభించలేదు. శిల్పా చౌదరికి ఉప్పర్ పల్లి న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. కిట్టీ పార్టీల పేరుతో ప్రముఖులతో పరిచయాలు పెంచుకుని, వారికే టోకరా వేసిన శిల్పా చౌదరిని గత కొన్నిరోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. బెయిల్ కోరుతూ ఆమె న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా, రెండు రోజుల కస్టడీకి అప్పగించాలని నార్సింగి పోలీసులు పిటిషన్ వేశారు. గతంలో ఇచ్చిన మూడు రోజుల కస్టడీలో శని, ఆదివారాలు ఉండడంతో బ్యాంకు లావాదేవీల పరిశీలన సాధ్యం కాలేదని కోర్టుకు విన్నవించారు. ఒక్కరోజు మాత్రమే ఆమెను కస్టడీకి అప్పగిస్తున్నట్టు కోర్టు పేర్కొంది. న్యాయస్థానం శిల్పా చౌదరి బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. ఆమెకు రిమాండ్ విధిస్తున్నట్టు తెలిపింది. అనంతరం శిల్పా చౌదరిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో శిల్పా చౌదరి భర్తకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
కోట్లు కొల్లగొట్టి..
కిట్టీ పార్టీలు, పేకాట ఆడించి.. కోట్లు కొల్లగొట్టింది శిల్పాచౌదరి. అయితే రాధికా రెడ్డి అనే మహిళ తనను మోసం చేసినట్లు శిల్పా చౌదరి పేర్కొన్న సంగతి తెలిసిందే. శిల్ప కేసు విషయంలో పోలీసులు వారిని కూడా విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇద్దరి మధ్య గత కొన్నేళ్లుగా ఆర్ధిక లావాదేవీలు జరుగుతున్నాయని తెలిపింది. 6 శాతం వడ్డీ ఇస్తానని చెప్పిన రాధికకు రూ.30 కోట్లు ఇచ్చానని, ఆమె తిరిగి తనకు డబ్బులు చెల్లించలేదని చెప్పింది. రాధిక రియల్ఎస్టేట్, ఈవెంట్ మేనేజ్మెంట్ లు నిర్వహిస్తున్నట్లు శిల్పా తెలిపింది.
పోలీసుల విచారణ..
రాధిక పాత్రపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. రాధికారెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చి ఆమెను విచారించనున్నారు. కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని, వారంతా బ్లాక్ మనీని వైట్ చేయమని ఇచ్చారని ఆమె చెప్పుకొచ్చింది. రాధికారెడ్డి ఇవ్వాల్సిన డబ్బుల కాకుండా...తాను ఇన్వెస్ట్ చేసిన ప్రాజెక్టుల నుంచి డబ్బులు రాలేదు కాబట్టి నేను ఇవ్వలేక పోయానని... నేను ఎవరినీ మోసం చేయలేదని శిల్పా వివరించింది. ఉప్పర్పల్లిలోని రాజేంద్రనగర్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.
ఇక్కడే ఇలా..
సంపన్న కుటుంబాలకు చెందిన మహిళలను ఆకట్టుకున్న శిల్పా చౌదరి వారిని సిగ్నేచర్ విల్లాకు పిలిపించి కిట్టీపార్టీలతో పాటు పేకాట దందా నిర్వహించినట్లుగా తెలిసింది. ఆ సమయంలో రూ.లక్షల ఖరీదైన మద్యాన్ని సరఫరా చేసేదని సమాచారం. పోలీసులు ఆ దిశగా కూడా విచారణ చేశారు. శిల్పా చౌదరి భర్త కృష్ణశ్రీనివాస ప్రసాద్ అలెక్సా అనే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రీజినల్ డైరెక్టర్గా పనిచేసేవాడని పోలీసులు గుర్తించారు. భార్య చేస్తున్న మోసాల్లో పాలుపంచుకున్న శ్రీనివాస ప్రసాద్ ఆ డబ్బుతో ఇటీవల రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించి భూములు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వాటికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది.