Omicron భయం: వర్క్ ఫ్రమ్ హోమ్ పొడిగించే ఆలోచనలో హైదరాబాద్లోని ఐటీ కంపెనీలు
ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. భారతదేశంలోనూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కావడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. భారత్ లో కర్ణాటక రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు కావటం ప్రస్తుతం దేశాన్ని ఆందోళనలోకి నెట్టింది. ఇక దేశం మొత్తం ఒమిక్రాన్ భయంతో వణికిపోతుంది. కరోనా దెబ్బకు ఐటీ కంపెనీలు సైతం గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. గత ఏడాది నుండి ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం గానే పని చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కోవిడ్-19 వేరియంట్ ఒమిక్రాన్ యొక్క ముప్పు మధ్య, హైదరాబాద్లోని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను మరి కొంత కాలం వర్క్ ఫ్రమ్ హోం పొడిగించి ఇళ్ళ నుండే పని చేయించాలనే ఆలోచనలో ఉన్నాయి.
వర్క్ ఫ్రమ్ హోమ్ పొడిగించే ఆలోచనలో హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజ్ అసోసియేషన్
హైదరాబాద్లోని ఐటీ కంపెనీల అపెక్స్ బాడీ అయిన హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె అరోల్ తాజా పరిస్థితిని ఉటంకిస్తూ చాలా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ పొడిగించే ఆలోచనలో ఉన్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం పెద్ద కంపెనీల్లోని ఐదు శాతం మంది ఉద్యోగులు ఆఫీసు నుంచి పనిచేస్తున్నారని, అయితే మధ్యతరహా కంపెనీలు 30 శాతం, చిన్న తరహాలో 70 శాతం ఆఫీసుల నుండి పని చేస్తున్నాయి. ఇంతకుముందు, ఈ కంపెనీలు ఆఫీసు నుండి పనిచేసే ఉద్యోగుల శాతాన్ని పెంచాలని ఆలోచనలో ఉన్నాయి. కరోనా కట్టడి సాధ్యమైందని అందరినీ ఆఫీస్ నుండి వర్క్ చెయ్యటానికి పిలవాలని భావించాయి. అయితే, ఓమిక్రాన్ ముప్పు కారణంగా, హైదరాబాద్లోని కంపెనీలు తమ ప్రణాళికలను ఆలస్యం చేసే అవకాశం ఉంది.
ఆఫీసుల నుండి పని చేయించేందుకు రెడీ.. ఒమిక్రాన్ భయంతో మళ్ళీ వెనుకంజ
కోవిడ్ 19 మహమ్మారి కారణంగా గతేడాది నుండి చాలా కంపెనీలు తమ కార్యాలయాలను మూసివేసి రిమోట్గా పని చేయవలసి వచ్చింది. మొదట్లో ఇబ్బంది పడిన ప్రజలు మెల్లగా వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతికి అలవాటు పడుతున్నారు. ప్రస్తుతం, హైదరాబాద్లోని దాదాపు అన్ని ఐటి కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతించడమే కాకుండా ఆన్లైన్లో ఇంటర్వ్యూలు నిర్వహించిన తర్వాత అభ్యర్థులకు ఉద్యోగాలను కూడా అందిస్తున్నాయి. ప్రస్తుతం అవసరాన్ని బట్టి కార్యాలయాల నుంచి తక్కువ శాతంలో ఉద్యోగులను పని చేయిస్తున్నారు. ఇక కరోనా మహమ్మారి వ్యాప్తికి ముందు ఉన్న స్థితికి రావాలని ప్రయత్నం చేస్తున్న కంపెనీలకు ఒమిక్రాన్ వేరియంట్ షాక్ ఇచ్చింది. దీంతో మళ్లీ మరికొంత కాలం వర్క్ ఫ్రం హోం కొనసాగించాలని భావిస్తున్నారని సమాచారం.
ఈ ఏడాది కూడా ఆఫీసులకు వెళ్ళేది లేదు, గతంలోనే సర్వేలో తేల్చిన హైసియా
హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రైసెస్ అసోసియేషన్ ఇప్పటికే నిర్వహించిన సర్వేలో
ఈ సంవత్సరం కూడా ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లే పని చేసే పరిస్థితి లేదని, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నూరు శాతం అసాధ్యమని వెల్లడించింది . ఈ సంవత్సరం దేశంలోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ప్రణాళికలు ఆధారపడి ఉంటాయని పేర్కొంది. అయితే వ్యాక్సినేషన్ యుద్ధ ప్రాతిపదికన సాగటం, అలాగే కరోనా కేసులు తగ్గుముఖం పట్టటంతో ఊపిరి పీల్చుకున్న వారికి ఒక్కసారిగా మళ్ళీ ఒమిక్రాన్ టెన్షన్ మొదలైంది. ఈ నేపధ్యంలోనే మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోం పొడిగించే ఆలోచనలో ఉన్నాయి ఐటీ సంస్థలు.
ఒమిక్రాన్ భయాల మధ్య అలెర్ట్ అయిన తెలంగాణా సర్కార్
ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలోనూ ఒమిక్రాన్ వేరియంట్ భయాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. డిసెంబర్ 1న, కొన్ని దేశాల్లో ఓమిక్రాన్ నివేదించిన దృష్ట్యా హైదరాబాద్ ట్యాంక్ బండ్లో ఆదివారం-ఫండే ఈవెంట్ను రద్దు చేసినట్లు ప్రకటించారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ఆరోగ్యశాఖ అధికారులు నిఘాను పటిష్టం చేశారు. ప్రమాదంలో ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను పరీక్షించేందుకు మొత్తం 10 బృందాలను విమానాశ్రయంలో నియమించారు. ఒమిక్రాన్ సంబంధిత కేసులన్నీ ఇప్పటివరకు తేలికపాటి లక్షణాలను కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. దేశంలో మరియు విదేశాలలో ఇటువంటి అన్ని సందర్భాలలో ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్లో తీవ్రమైన లక్షణాలు ఏవీ గుర్తించబడలేదు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.