Presidential Election 2022: తెలంగాణాకు రానున్న ద్రౌపది ముర్ము; ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ సిద్ధం!!
హైదరాబాద్: ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము జులై 12వ తేదీన మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. భారతదేశ 16వ రాష్ట్రపతి ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ, రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న వారు దేశవ్యాప్తంగా ప్రచారంలో మునిగిపోయారు. రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18వ తేదీన నిర్వహించనున్న నేపథ్యంలో ఎన్నికలలో తమకు మద్దతు ప్రకటించాలని అభ్యర్థులు వివిధ రాష్ట్రాల్లో పర్యటనలు సాగిస్తున్నారు.
జులై 12న హైదరాబాద్ కు బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము
బిజెపి తరఫున అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము ఎన్నికల బరిలో నిలవగా, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి యశ్వంత్ సిన్హా వచ్చి వెళ్లగా, తాజాగా ద్రౌపది ముర్ము తెలంగాణ రాష్ట్రానికి జూలై 12 వ తేదీన రానున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ కు రానున్న ఆమెకు ఘనంగా స్వాగతం పలకడం కోసం బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై 12 వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అనంతరం ద్రౌపది ముర్ము బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపీలతో పరిచయ కార్యక్రమంలో పాల్గొంటారు.
బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్ రావు, రాజా సింగ్ లతో మాట్లాడనున్న ద్రౌపది ముర్ము
తెలంగాణా బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజా సింగ్, ఈటల రాజేందర్ తో మాట్లాడతారు. ఇక తెలంగాణకు చెందిన మేధావులతో కూడా ద్రౌపది ముర్ము సదస్సులో పాల్గొంటారు. ఇక ఇప్పటికే విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన యశ్వంత్ సిన్హా తెలంగాణ రాష్ట్రానికి బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల సమయంలో వచ్చి వెళ్లారు. విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన యశ్వంత్ సిన్హా కు తెలంగాణ సీఎం కేసీఆర్ ఘనస్వాగతం పలికి, భారీ ర్యాలీ నిర్వహించారు.
ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం పలికేలా బీజేపీ ప్లాన్
యశ్వంత్ సిన్హాతో టిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల పరిచయ కార్యక్రమం వేదికగా సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ పై, కేంద్రంలోని అధికార బీజేపీ విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల సమయంలో కావాలని సీఎం కేసీఆర్ యశ్వంత్ సిన్హా రాకపై పెద్దఎత్తున హడావిడి చేశారు. ఇక ఈ క్రమంలో తాజాగా బిజెపి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము రానున్న నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.