సిట్ స్పీడప్: బీఎల్ సంతోష్కు నోటీసులు, హాజరుకాకుంటే అరెస్ట్
ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై సిట్ విచారణ స్పీడందుకుంది. ఇవాళ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్కు నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21న ఉదయం పదిన్నర గంటలకు కమాండ్ కంట్రోల్లో గల సిట్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ చేస్తామని నోటీసులో స్పష్టం చేశారు.

సిట్ ఇంచార్జీ
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో ఇటీవలే సిట్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆరుగురు పోలీస్ ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. నల్గొండ ఎస్పీ రాజేశ్వరి, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, శంషాబాద్ డీసీపీ జగదేశ్వర్రెడ్డి, మొయినాబాద్ సీఐ లక్ష్మిరెడ్డిను సిట్ సభ్యులుగా నియమించారు.

ఆఫర్
హైదరాబాద్ నగర శివారులో గల మొయినాబాద్ మండలం అజీజ్నగర్లోని ఓ ఫామ్హౌస్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్రెడ్డి, రేగా కాంతారావును ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు సంప్రదించారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. పార్టీ ఫిరాయిస్తే వారికి ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని.. దాంతోపాటు కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారని చెప్పారు.

ఆ ముగ్గురు..
ఈ కేసులో రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ, మరొకరు తిరుపతికి చెందిన సింహ యాజులు, హైదరాబాద్కు చెందిన నందకుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు.

కేసు నమోదు
అంతకుముందు ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ రావడంతో కేసు కూడా నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు తమకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆదివారం బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications