40 సీట్లే కచ్చితం.. 30, 35 సీట్ల కోసం కష్టపడాల్సిందే, కేసీఆర్ చేతిలో సర్వే రిపోర్ట్
వచ్చే ఎన్నికలపై గులాబీ దళపతి ఫోకస్ చేశారు. ఎలాగైనా గెలవాలని అనుకుంటున్నారు. అందుకోసం ఇంటర్నల్గా సర్వే చేయించారు. ఎమ్మెల్యేల పరిస్థితి, పార్టీపై ప్రభావం, విజయావకాశాలు.. తదితర అంశాలను తీసుకొని సర్వే చేశారు. ఇందులో కాస్త అటు ఇటుగా రిపోర్టు వచ్చాయట. దీంతో కేసీఆర్ వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారని వినికిడి.
3 భాగాలుగా..
రాష్ట్రంలో గల 119 నియోజకవర్గాలను మూడు భాగాలుగా విభజించారు. అలా డివైడ్ చేసి విజయ అవకాశాలను కేసీఆర్ అంచనా వేశారు. కచ్చితంగా గెలిచేవి 40 సీట్లే ఉన్నాయట. కొంచెం కష్టపడితే గెలిచే నియోజకవర్గాలు 30 నుంచి 35 వరకు ఉన్నాయనే కఠోర విషయం తెలిసింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు.. కానీ అటు ఇటు అయితే మాత్రం టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మరోలా ఉంటుంది. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు వీక్గా ఉన్నారని తెలిసింది.
వాటిపై ఫోకస్
బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో కేసీఆర్ ఫోకస్ చేశారు. సదరు అభ్యర్థుల విజయం కోసం ఇప్పటి నుంచే కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేశారు. బలహీనంగా ఉన్న చోట ప్రత్యేక దృష్టిసారించేలా మంత్రులు, కీలక నేతలకు బాధ్యతలు అప్పగిస్తారట. త్వరలో ఇంచార్జీలను కూడా నియమిస్తారట. వారిని ఈ ఏడాది తిప్పి ఫలితం తారుమారయ్యేలా చేస్తారని తెలిసింది.
మూడోసారి అధికారం
రాష్ట్రంలో వరసగా మూడో ఏడాది అధికారం చేపట్టాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుకుంటున్నారు. ఆ మేరకు ప్రణాళిక రచించి.. ముందడుగు వేస్తున్నారు. సర్వే రిపోర్ట్ ఆధారంగా చర్యలు ఉంటాయి. గెలవడం కష్టంగా ఉన్న చోట.. సర్వ శక్తులు ఒడ్డనున్నారు. ప్రభుత్వం చేసిన పనులను వివరించి జనం మూడ్ మార్చుతారు. లేదంటే తాయిలాలు ప్రకటించే అవకాశం ఉంది. ఆయా చోట్ల కమ్యూనిటీని బట్టి ఆకట్టుకునే పనులు ఉంటాయి. ఉదహరణకు దళితులు ఎక్కువ మంది ఉంటే దళిత బంధు ఇస్తామని చెబుతారు. బీసీలు ఉంటే.. వారికి వెహికిల్ లోన్స్, ఇతర రుణ సదుపాయం అని చెబుతారు. ఇలా అందరినీ ఆకట్టుకొని.. అల్టిమేట్గా గెలవాలని కేసీఆర్ అనుకుంటున్నారు. ఆ మేరకు ముందడుగు వేయబోతున్నారు.