భారీ ఎన్కౌంటర్: 15మంది నక్సల్స్ మృతి(ఫొటోలు)
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు ఘోరమైన ఎదురుదెబ్బ తగిలింది. సుకుమా జిల్లా భెజ్జి పోలీస్ఠాణా పరిధిలో గురువారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో సుమారు 15మంది నక్సల్స్ మృతిచెందినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఘటనాస్థలంలో మాత్రం ఒక మాహిళా మావోయిస్టు సహా రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి.
మహిళా మావోయిస్టును కుంట ఏరియా కమిటీ సభ్యురాలు జోగిగా గుర్తించారు. ఈ ఘటనపై బస్తర్ ఐజీ ఎస్కార్కే కల్లూరి, సుక్మా ఏఎస్పీ సంతోశ్సింగ్ రాయ్పూర్లో మీడియాతో మాట్లాడారు. నక్సల్స్ మొట్టమొదటి పోరాట పటాలం కమాండర్ హిద్మాను పట్టుకునేందుకు గాలింపు నిర్వహిస్తుండగా ఈ ఎన్కౌంటర్ జరిగిందని ఐజీ తెలిపారు.
కాల్పుల్లో సీఆర్పీఎఫ్కు చెందిన కోబ్రా దళం, మరోరెండు జిల్లా రిజర్వ్ బృందాలు(డీఆర్జీ) పాల్గొన్నాయన్నారు. మావోయిస్టులకు గట్టిపట్టున్న దుబ్బకొంట గ్రామానికి చెందిన ఒక సన్నిహితుడి వివాహానికి హిద్మా హాజరవుతున్నట్లు సమాచారం అందిందన్నారు. దీంతో అతన్ని పట్టుకోవడం కోసం ఈ ప్రాంతంలో బలగాలు గాలింపు చేపట్టాయన్నారు.
గురువారం తెల్లవారుజామున బలగాలు దుబ్బకొంట గ్రామం సమీపంలోని అటవీప్రాంతంలో గాలిస్తుండగా ఎదురుపడిన మావోయిస్టులు వారిపై కాల్పులకు తెగబడ్డారన్నారు. వెంటనే బలగాలు కూడా కాల్పులకు దిగాయన్నారు. ఇరువర్గాల మధ్య సూమారు రెండుగంటలపాటు భారీ ఎన్కౌంటర్ జరిగిందని తెలిపారు.
అనంతరం ఘటనాస్థలంలో రెండు మృతదేహాలు, తుపాకులు, పలు తూటాలు, సంచులు, పత్రాలు లభ్యమయ్యాయన్నారు. సూమారు వంద మంది మావోయిస్టులు ఈ ఎదురుకాల్పుల్లో పాల్గొన్నారని సుకుమా జిల్లా ఏఎస్పీ సంతోశ్ సింగ్ తెలిపారు. అయితే ఈ ఘటనలో హిద్మా జాడ మాత్రం లభించలేదన్నారు. 2010లో 76మంది జవాన్లు చనిపోయిన చింతల్నార్ దాడి, 2013లో 31మంది పోలీసులు మృతిచెందిన బస్తర్లోని జిరమ్ వేలీ దాడుల్లో హిద్మా పాల్గొన్నారు.
కాగా, ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో గురువారం నలుగురు మావోయిస్టులును అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఏఎస్పీ విజయ్ పాండే తెలిపారు. ద్రాభా పోలీసుఠాణా పరిధిలోని అటవీప్రాంతంలో సీఆర్పీఎఫ్, రాష్ట్ర పోలీసు బలగాలు సంయుక్తంగా గాలింపు నిర్వహిస్తుండగా నలుగురు నక్సల్స్ కనిపించారని తెలిపారు.
బలగాలను చూసి పారిపోతున్న వారిని అదుపులోకి తీసుకొని తనిఖీచేయగా సుమారు 15 కిలోల పేలుడుపదార్థం(ఐఈడీ) లభ్యమైందన్నారు. వాటిని స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులను అయుతు మండవి, ముక కశ్యప్, అయుత మండవి, హుగా మండవిగా గుర్తించినట్లు వెల్లడించారు.