సిమితో సంబంధాలు లేవు: 17 మంది విడుదల
బెంగళూరు: వివిధ కేసులలో అరెస్టు అయిన అనుమానిత ఉగ్రవాదులను విడుదల చెయ్యాలని కర్ణాటకలోని హుబ్బళి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. హుబ్బళి ఒకటవ అడిషనల్ కోర్టు గురువారం ఈ ఆదేశాలు జారీ చేసింది.
సిమి ముసుగులో దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారని, సిమితో సంబంధాలు సాగిస్తున్నారని ఆరోపిస్తూ హుబ్బళి పోలీసులు 17 మంది అనుమానితులను 2008లో అరెస్టు చేశారు. అప్పటి నుండి వీరు జైలులో ఉన్నారు.
పోలీసులు విచారణ చేసి నివేదికను న్యాయస్థానంలో సమర్పించారు. అయితే సరైన సాక్ష్యాలు సమర్పించడంలో పోలీసులు పూర్తిగా విఫలం అయ్యారని, వీరు సిమి కార్యకర్తలు అని నిరూపించలేక పోయారని న్యాయస్థానం గుర్తించింది.
అరెస్టు అయిన వారిలో సఫ్దార్ హుస్సేన్ నగూరితో సహా 17 మంది ఉన్నారు. నగూరి సిమి నాయకుడు అని పోలీసు అధికారులు చాల సందర్బాలలో చెప్పారు. అయితే సాక్ష్యాలు సమర్పించడంలో పోలీసులు మాత్రం విఫలం అయ్యారు. వీరి మీద ఎలాంటి నేరం రుజువు కాలేదని అందుకే విడుదల చేస్తున్నామని న్యాయస్థానం వెల్లడించింది.