శశికళ చేతిలో నాయకుల జాతకాలు: అందుకే నాటకాలు
జయలలిత మూడు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రి అయిన సమయంలో ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి అన్నాడీఎంకే పార్టీ నాయకుల పూర్తి సమాచారం సేకరించి ఆమె దగ్గర పెట్టుకున్నారు.
చెన్నై: అన్నాడీఎంకే మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల అందరి జాతకాలు ఇప్పుడు శశికళ చేతిలో ఉన్నాయని సమాచారం. జయలలిత మూడు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో జయలలిత ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి అన్నాడీఎంకే పార్టీ నాయకుల పూర్తి సమాచారం సేకరించి ఆమె దగ్గర పెట్టుకున్నారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అనేక మంది నాయకులను 2016లో జరిగిన ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకుండా వారిని దూరం పెట్టారు. క్రిష్ణగిరి జిల్లాకు చెందిన అన్నాడీఎంకే పార్టీ నాయకుడు కే.పి. మునిస్వామి మీద ఆరోపణలు రావడంతో 2014లో ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించారు.
మీకో దండం: పన్నీర్ సెల్వం రాజీనామా ? శశికళ చేతిలో లేఖ
మళ్లీ కేపీ. మునిస్వామికి మంత్రి పదవి ఇవ్వలేదు. అదే జిల్లాకు చెందిన బాలక్రిష్ణా రెడ్డి మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే మంత్రి పదవి ఇచ్చారు. అప్పటి నుంచి అన్నాడీఎంకే నాయకులు జాగ్రత్తగా నడుచుకుంటున్నారు. గతంలో మంత్రులు, శాసన సభ్యులు ఏమి చేస్తున్నారు ? అని జయలలిత ఎప్పటికప్పుడు నిఘా వర్గాలతో సమాచారం సేకరించి తన దగ్గర పెట్టుకున్నారు.
ఇప్పుడు జయలలిత మరణించిన తరువాత ఇంటలిజెన్స్ వర్గాలు అన్నాడీఎంకే పార్టీ నాయకుల మీద ఇచ్చిన నివేదికలు మొత్తం శశికళ చేతిలోకి వెళ్లాయని సమాచారం. అందుకే మా పదవులకు ఎక్కడ ఎసరు పెడతారో అనే భయంతో ఇప్పుడు మంత్రులు, ఎంపీలు, శాసన సభ్యులు చిన్నమ్మ భజన చేస్తున్నారు.
శశికళకు పన్నీర్ సెల్వం పాదాభివందనం: వైరల్ వీడియో
తమిళనాడు ఇంటిలిజెన్స్ వర్గాలు నాలుగు నెలల క్రితం వరకు నాయకులు కదలికలపై నిఘా వేసి వారి జాతకాలు అన్నీ జయలలితకు ఇచ్చారని అన్నాడీఎంకే నాయకులే అంటున్నారు. ఇప్పుడు ఆ నివేదికలు అన్నీ శశికళ చేతిలోకి వెళ్లిపోయాయని తెలిసింది.
జయలలితకు ఇంత కాలం జై కొట్టిన నాయకులు ఇప్పుడు అంతా చిన్నమ్మ చిన్నమ్మ అంటు భజన చేస్తున్నారు. నాయకులు ఇలాగే భయపడుతూ శశికళకు జేజేలు కొడుతుంటారని, చివరికి అమ్మ జయలలిత పేరు మరిచిపోతారని అన్నాడీఎంకే కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.