గుర్మీత్ సింగ్పై 5 కేసులు: జర్నలిస్ట్ హత్య, శిష్యులకు వ్యంధత్వంపై ఆరోపణలు..
2007లో సిక్కుల గురువు గోవింద్ సింగ్ వస్త్రధారణను అనుకరించినందుకు ఆయనపై కేసు నమోదైంది.
చంఢీగఢ్: ఇద్దరు సాద్వీలపై అత్యాచార ఆరోపణల్లో దోషిగా తేలిన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ బాబా గురించి ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. అత్యంత లగ్జరీ బాబాగా పేరొందిన ఈ బాబాపై అత్యాచార కేసు మాత్రమే కాక మరో ఐదు కేసులు కూడా గతంలో నమోదయ్యాయి.
అత్యాచార కేసు వెలుగుచూడటానికి కారణమైన ఓ వ్యక్తిని హత్య చేసినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. దాంతో పాటు డేరా సచ్చా సౌదాలో జరుగుతున్న అసాంఘీక కార్యక్రమాలను బయటి ప్రపంచానికి తెలిసేలా చేసినందుకు ఛత్రపతి అనే జర్నలిస్టును హత్య చేసినట్లుగా కూడా ఆరోపణలున్నాయి. అలాగే దైవత్వం పేరుతో చాలామంది శిష్యగణాన్ని వ్యంధత్వానికి ప్రోత్సహించడాన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
రంజిత్ సింగ్ హత్య:
జులై, 2002లో జరిగిన డేరా మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో గుర్మీత్ సింగ్పై ఆరోపణలున్నాయి. సాధ్వీలపై అత్యాచారం జరిగినట్లుగా ప్రధాని, కేంద్ర హోంమంత్రి సహా పలు కీలక శాఖలకు లేఖలు వెల్లడంలో రంజిత్ సింగ్దే ప్రధాన పాత్ర అని భావించిన గుర్మీత్.. ఆయనను హత్య చేసినట్లుగా చెబుతారు. ఈ హత్య ఘటనలో గుర్మీత్ సింగ్ పై కేసు నమోదు కాగా.. సీబీఐ ప్రత్యేక కోర్టులో దీనిపై విచారణ చివరి దశలో ఉంది.
రాంచందర్ ఛత్రపతి హత్య:
సిర్సా కేంద్రంగా పనిచేస్తున్న డేరా సచ్చా సౌదాలో అసాంఘీక కార్యక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ స్థానిక జర్నలిస్ట్ ఛత్రపతి అప్పట్లో ఒక కథనం రాశారు. ఆ తర్వాత అక్టోబర్ 23,2002లో ఆయన హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక గుర్మీత్ సింగ్ ఉన్నారన్న ఆరోపణలున్నాయి. ఈ హత్య విషయంలో ఆయనతో పాటు మరో ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి. పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఈ కేసు బదిలీ చేయబడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విచారణ తుది దశలో ఉంది.
శిష్యగణానికి వ్యంధత్వం:
శిష్యగణం వ్యంధత్వాన్ని పాటించేలా గుర్మీత్ ప్రోత్సహించారన్న ఆరోపణలున్నాయి. దాదాపు 400మంది గుర్మీత్ శిష్యులు వ్యంధత్వాన్ని పాటించినట్లుగా తెలుస్తోంది. దీనిపై డిసెంబర్ 23,2014లో కేసు నమోదవగా, అక్కడి హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. దైవానుగ్రహం పొందే మార్గమంటూ శిష్యులను వ్యంధత్వానికి ప్రోత్సహించినట్లుగా గుర్మీత్పై ఆరోపణలున్నాయి.
గోవింద్ సింగ్ వస్త్రధారణ అనుకరించినందుకు:
2007లో సిక్కుల గురువు గోవింద్ సింగ్ వస్త్రధారణను అనుకరించినందుకు గుర్మీత్ పై కేసు నమోదైంది. బతిండా పోలీస్ స్టేషన్ లో దీనిపై కేసు నమోదవగా.. పంజాబ్, హర్యానాల్లో దీన్ని నిరసిస్తూ ఆయన భక్తులు భారీ ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. 2014లో పంజాబ్ ప్రభుత్వం ఈ కేసును ఉపసంహరించుకుంది.
మారణాయుధాల కేసు:
డేరా సచ్చా సౌదా యాక్టివిస్టులకు మారణాయుధాల శిక్షణ ఇప్పిస్తున్నారని జాతీయ భద్రత సలహా కమిటీ డిసెంబర్,2010లో ఆరోపించింది. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై సమగ్ర విచారణకు ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వడంతో ఈ కేసుకు తెరపడింది.