హక్కుల నేతల గృహనిర్బంధం మరో 4వారాలు పొడగింపు : సుప్రీంకోర్టు
భీమా కొరెగావ్ అల్లర్ల వెనక హక్కుల కార్యకర్తలు ఉన్నారన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా ఉన్న ఐదుగురు హక్కుల నేతలను అరెస్టు చేశారు. అంతేకాదు మావోయిస్టులతో వీరు సత్సంబంధాలు నెరుపుతున్నారన్న ఆరోపణలు కూడా నమోదు చేశారు. అయితే వీరిని గృహనిర్బంధంలో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తాజాగా ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తమను ఎవరు లేదా ఏ విచారణ సంస్థ విచారణ చేయాలో చేప్పే అధికారం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు విచారణకు సిట్ అవసరం లేదని చెప్పిన సర్వోన్నత న్యాయస్థానం పూణే పోలీసులే విచారణ చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే వారి గృహనిర్బధం మరో నాలుగువారాల పాటు పొడగిస్తూ ఆదేశాలిచ్చింది సర్వోన్నత న్యాయస్థానం. హక్కుల నేతల నివాసాలపై పోలీసుల సోదాలు నిర్వహించి అక్రమంగా అరెస్టు చేశారన్న పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణ చేసింది.
విరసం నేత వరవరరావు, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, వెర్నన్ గోన్సాల్వేస్, గౌతమ్ నవలఖలను పూణే పోలీసులు అరెస్టు చేశారు. భీమా కోరేగావ్లో హింస చెలరేగేందుకు వీరే కారణమంటూ పూణే పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కూడా వీరు కుట్రపన్నుతున్నారంటూ ఆరోపణలు నమోదు చేశారు. వీరిని అరెస్టు చేయడంతో కోర్టు ఈ ఐదుగరు హక్కుల కార్యకర్తలను గృహనిర్భంధంలో ఉంచాలని సూచించింది. అదేసమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హక్కుల నేతలు తమ వాదనలను కిందికోర్టులో వినిపించుకోవచ్చంటూ తెలిపింది.
నిరసన వ్యక్తం చేసినందుకు కాదు...మావోలతో సంబంధం ఉన్నందుకే...
ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. హక్కుల నేతలు నిరసన వ్యక్తం చేసినందుకు జరగలేదని మావోయిస్టులతో సత్సంబంధాలు నెరిపినందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నందునే అరెస్టులు జరిగాయని జస్టిస్ దీపక్ మిశ్రా తీర్పును చదివారు. నిరసన వ్యక్తం చేసినందుకే అరెస్టులు జరిగాయనేదానికి ఎలాంటి ఆదారాలు లేవని జస్టిస్ ఖన్విల్కర్ తెలిపారు. అంతేకాదు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తనను ఎవరు విచారణ చేయాలో చెప్పే అధికారం లేదన్నారు.
తీర్పుతో విబేధించిన మరో జడ్జి జస్టిస్ చంద్రచూడ్
మరోవైపు ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఖన్విల్కర్లు ఇచ్చిన తీర్పుతో తాను విబేధిస్తున్నట్లు చెప్పారు జస్టిస్ చంద్రచూడ్. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని అన్నారు. పిటిషన్లో వాస్తవాలు ఉన్నాయని చెబుతూనే మహారాష్ట్ర పోలీసులు ప్రెస్ మీట్ పెట్టడం, మీడియాకు లేఖలు ఇవ్వడం పై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. సుధా భరద్వాజ్ రాసిన లేఖలను పోలీసులు ఎలా ప్రదర్శిస్తారని ఆయన ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే విచారణలో పారదర్శకత లోపించినట్లు కనిపిస్తోందన్నారు. సరైన విచారణ పారదర్శకతతో కూడిన విచారణ చేయకుండా ఐదు మంది హక్కుల నేతలను అరెస్టు చేయడమంటే.. రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛకు అర్థం ఉండదని అన్నారు. కేవలం ప్రజాస్వామ్యంలో తమ నిరసన తెలిపినందుకే వారిని అరెస్టు చేయడం జరిగిందని జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.
బీమా కోరెగావ్ కేసులో కింది కోర్టులను సంప్రదించొచ్చు
భీమాకోరేగావ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న హక్కుల నేతలు కింది కోర్టును సంప్రదించొచ్చని పేర్కొంది. చరిత్రకారుడు రోమిలా థాపర్, ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్, దేవిక జైన్, సోషియాలజీ ప్రొఫెసర్ సతీష్ దేశ్ పాండే, మానవహక్కుల లాయర్ మజ దారువాలాలు హక్కుల నేతల అరెస్టులు అక్రమం అని చెబుతూ స్వచ్చంధ సంస్థతో కేసు విచారణ జరిపించాలని కోరారు. హక్కుల నేతలను ఆగష్టు 28న పూణే పోలీసులు అరెస్టు చేశారు.