జయ మృతిపై శ్వేతపత్రం విడుదలకు అన్నాడీఎంకె 'నో'
చివరి రోజుల్లో జయలలితకు జరిగిన చికిత్స వివరాలపై శ్వేతపత్రం విడుదలకు అన్నాడీఎంకె వర్గాలు 'నో' చెప్పాయి.
చెన్నై: నాటకీయ పరిణామాల నడుమ అపోలో ఆసుపత్రిలో కన్నుమూసిన తమిళ దివంగత సీఎం జయలలిత ఆరోగ్యం, ఆమెకు జరిగిన చికిత్సపై పలు అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇదే విషయమై నటి గౌతమి ప్రధాని మోడీకి లేఖ రాయగా.. డీఎంకె నేత స్టాలిన్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా దీనిపై స్పందించిన అన్నాడీఎంకె వర్గాలు శ్వేతపత్రం విడుదలకు 'నో' చెప్పాయి. జయ మరణానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసే ఆలోచన లేదని వెల్లడించాయి. అన్నాడీఎంకె సమాధానం పట్ల స్టాలిన్ ఎలా స్పందిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
కాగా, జయ నెచ్చెలి శశికళ విషప్రయోగం ద్వారా జయలలిత మరణానికి కారణమయ్యారని పలువురు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. జయ మరణంపై విచారణ జరిపించాలని సుప్రీం కోర్టులోను పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. మొత్తానికి జయ చికిత్సకు సంబంధించిన వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయడానికి అన్నాడీఎంకె సముఖంగా లేదన్నది స్పష్టమైంది.