మోడీ స్పీచ్ వినడానికి అఖిలేష్ యాదవ్ లాప్టాప్లు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల్లో గెలిచిన అనంతరం అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం యువతకు లాప్టాప్లను అందజేసింది. అయితే ఆ ల్యాప్టాప్లు భారతీయ జనతా పార్టీ ప్రచారానికి ఉపయోగపడుతున్నాయి. అదెలాగంటే.. భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రెయిచ్లో నిర్వహిస్తున్న ర్యాలీని అక్కడి యువత ఆ ల్యాప్టాప్లలో ఇంటర్నెట్ ద్వారా ప్రత్యక్షప్రసారాన్ని వీక్షిస్తోంది.
ఈ విషయం భారతీయ జనతా పార్టీ ర్యాలీ మేనేజర్ల ద్వారా బయటికి వచ్చింది. మోడీ ర్యాలీ సందర్భంగా తమ వద్ద నుంచే ఓ బ్యాటరీని కొందరు యువకులు తీసుకెళ్లారని, ఎందుకని ప్రశ్నిస్తే.. తాము నివసిస్తున్న ప్రాంతంలో విద్యుత్ లేదని చెప్పినట్లు వారు తెలిపారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న సమాజ్ వాది పార్టీ నాయకులు కొందరు పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. బిజెపి నేతలు మాత్రం ఈ విషయంపై అంతగా స్పందించలేదు.
ప్రభుత్వం అందజేసిన ల్యాప్టాప్లు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ఈ విషయాన్ని బిజెపి కూడా ఒప్పుకోవాలని సమాజ్వాది పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజేంద్ర చౌధరి చెప్పుకొచ్చారు. అయితే విద్యుత్ పంపిణీయే సరిగాలేని రాష్ట్రంలో ప్రభుత్వం విద్యుత్తో నడిచే ల్యాప్టాప్లు అందజేయడమేంటోనని ప్రతిపక్షాలు అధికార పక్షంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
కాగా కొందరు బిజెపి నేతలు ఆ యువకుల దగ్గర ఉన్న ల్యాప్టాప్లపై ఉన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ లోగోను దాచేందుకు బిజెపి స్టిక్కర్ దానిపై అంటించారు. అయితే ఈ విషయాన్ని గమనించిన మీడియాతో బిజెపి నేత ఒకరు సంఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారు. తమ పార్టీ ప్రచారాన్ని పార్టీ అభిమానులకు, ప్రజలకు ప్రత్యక్షప్రసారం ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.