హాఫ్ రేటుకే లిక్కర్, ఈద్ రోజున ఫ్రీగా గోట్, ఉచితంగా విద్య, వైద్య : ఇదీ విరాసత్ పార్టీ మేనిఫెస్టో
న్యూఢిల్లీ : ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకొనేందుకు అదీ చేస్తాం, ఇదీ చేస్తామని చెప్తుంటారు. వివిధ హామీలు ఇస్తూ ఓట్లను క్యాష్ చేసుకొనే ప్రయత్నం చేస్తారు. కానీ ఢిల్లీలో సాంజీ విరాసత్ పార్టీ మాత్రం ఓటర్లకు వరాలు బాగానే కురిపించింది.
సగం ధరకే మద్యం
ఢిల్లీలో పోటీ చేస్తోన్న విరాసత్ పార్టీ తమ అభ్యర్థులను గెలిపించేందుకు కొత్త పంథాను ఎంచుకొంది. తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే లిక్కర్ రేటు సగం తగ్గిస్తామని మందుబాబులకు బంఫర్ ఆఫర్ ఇచ్చేసింది. అంతేకాదు ముస్లింల పవిత్ర పండుగుల రంజాన్, బక్రీద్ రోజున మేకలను ఉచితంగా అందజేస్తామని స్పష్టంచేసింది. అంతేకాదు మహిళలకు బంగారం ఉచితంగా ఇస్తామని ఓటర్లను అట్రాక్ట్ చేసే మేనిఫెస్టో రిలీజ్ చేసింది. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి పోటీచేస్తోన్న అమిత్ శర్మ తమ పార్టీ మేనిఫెస్టోనే ప్రింట్ చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు.
కేజీ టు పీహెచ్డీ వరకు ...
పైన చెప్పిన ప్రధాన హామీలే గాక ... కేజీ నుంచి పీహెచ్డీ వరకు ఉచితంగా విద్య అందిస్తామని పేర్కొంది. అలాగే ఢిల్లీలో చదువుకొనే విద్యార్థులకు మెట్రో రైలు/ బసు పాసులను ఉచితంగా అందజేస్తామని ప్రకటించింది. అంతేకాదు ప్రైవేట్ స్కూళ్లు ఫీజు వసూల్ చేయకుండా చర్యలు చేపడుతామని వెల్లడించింది. నిత్యావసర సరుకులు ఉచితంగా అందజేస్తామని పేర్కొన్నారు.
అమ్మాయిల పెళ్లికి రూ.2.5 లక్షలు
ఆడపిల్లలు జన్మించిన తల్లిదండ్రులకు రూ.50 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. అలాగే యువతి పెళ్లి కోసం రూ.2.5 లక్షలు ఇస్తామని వాగ్ధానం చేసింది. నిరుద్యోగ యువతను ఆకట్టుకొనేందుకు ప్రయత్నించింది. వారికి నెలకు రూ.10 వేల అందిస్తామని .. వృద్ధులు, వితంతులు, వికలాంగులకు రూ.5 వేల పింఛను అందజేస్తామని ప్రకటించింది. అంతేకాదు ప్రజలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.10 లక్షల వరకు వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు.