గుజరాత్ సీఎంగా అమిత్ షా: బాంబు పేల్చిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ శనివారం సాయంత్రం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కావొచ్చునని తెలుస్తోందని అభిప్రాయపడ్డారు.
వచ్చే ఏడాది గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అయితే ఆదివారం ఆయన సూరత్లోని ఓ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా, అది రద్దయింది.
దీంతో ఆ కార్యక్రమాన్ని గుజరాత్ సీఎం ఆనందిబెన్ పటేల్ అడ్డుకున్నారని ఆరోపించారు. ట్విట్టర్ వేదికగా బీజేపీ, ఆమెపై విమర్శల వర్షం కురిపించారు. ఆనందిబెన్ అవినీతి పాలనతో గుజరాత్ ప్రజలు విసుగుచెందారని మండిపడ్డారు.
అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనందిబెన్ స్థానంలో అమిత్ షాను నియమిస్తారని సమాచారం అని ట్వీట్ చేశారు. ఆనందీబెన్ ప్రభుత్వం అవినీతి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్లో మద్దతు లభిస్తోందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
కాగా, గుజరాత్లోని సూరత్లో ఆదివారం జరగాల్సిన ఏఏపీ ప్రచార కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందీబెన్ రద్దు చేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆయన శనివారం కుటుంబసభ్యులతో సహా సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకుని, రెండో రోజు సూరత్లోని ఆప్ ప్రచార కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. కుటుంబసభ్యులతో శనివారం గుజరాత్ చేరుకున్న ఆయన సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు.