ప్రతిష్ఠ దిగజారినా వీరభద్రుడిదే ‘పైచేయి’: కమలనాథుల్లోనూ పట్టుకోసం ఆరాటం
వచ్చేనెల తొమ్మిదో తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ అవినీతి ఆరోపణలు, అంతర్గత కుమ్ములాటలను ఎదుర్కొంటున్నది. ప్రత్యేకించి సీఎం వీరభద్రసింగ్ పరిస్థితి మ
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో అధికార కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో కొట్టుమిట్టాడుతోంది. ఒకవైపు సీఎం వీరభద్రసింగ్పై అవినీతి ఆరోపణలు హోరెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గత మార్చిలో జరిగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు మారిపోవడం ఆనవాయితీగా జరుగుతున్న పరిణామమే. మరోవైపు ఐదేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో పట్టు కలిగి ఉన్న సీఎం వీరభద్రసింగ్ పరిస్థితి ప్రస్తుతం ఇబ్బందికరంగా మారింది. రాష్ట్రంలో రోజురోజుకు శాంతిభద్రతల పరిస్థితి దిగజారుతోంది. ప్రభుత్వం పట్ల ప్రజల సాధారణ వ్యతిరేకతకు తోడు వీరభద్ర సింగ్ పై ఉన్న అవినీతి కేసులు అధికార కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా పరిణమించాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపుల్లో ఇబ్బందుల్లో ఓటమి పాలయ్యామని బీజేపీ సీనియర్ నేత ప్రేమ్ కుమార్ ధుమాల్ వంటి నేతలు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో 68 స్థానాలకు 26 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ ఈ దఫా 50కి పైగా సీట్లలో విజయం సాధించాలని కలలు కంటోంది. తద్వారా 2014లో నాలుగు లోక్ సభ సీట్లలో గెలుపొందినట్లే.. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయ పతాకాన్ని ఎగురేయాలని కమలనాథులు ఆశిస్తున్నారు.
అంతర్గత విభేదాల పరిష్కారంపై కాంగ్రెస్ పార్టీ నజర్
ప్రస్తుత సీఎం వీరభద్రసింగ్, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు సుఖ్విందర్ సింగ్ సుఖులతో కుదిరిన రాజీ ఫార్ములా మేరకు వీరభద్రసింగ్నే సీఎం అభ్యర్థిగా వీరభద్రసింగ్ పేరు ఖరారు చేశారు. కానీ అధికార కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలకు తోడు వెంటాడుతున్న ప్రజా వ్యతిరేకత ఆ పార్టీ ప్రచారానికి ఆటంకంగా నిలిచాయి. సీఎం అభ్యర్థిగా వీరభద్రసింగ్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపినందుకు పీసీసీ అధ్యక్షుడిగా సుఖ్విందర్ సింగ్ను కొనసాగించేందుకు ఇద్దరి మధ్య అంగీకారం కుదరడం వల్లే వీరభద్రుడినే రాహుల్ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. ‘మిషన్ పునరావ్రుతం' నినాదంతో ముందుకు వెళుతున్న కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాల పరిష్కారానికి చర్యలు తీసుకున్నది. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే తనపై కేంద్రంలోని బీజేపీ అవినీతి కేసులు నమోదు చేసిందని భావిస్తున్న సీఎం వీరభద్ర సింగ్.. తనపై సీబీఐ దాడులను ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు వాడుకోవాలని యోచిస్తున్నారు. గతంలోకూతురు వివాహం జరుగుతున్న వేళ వీరభద్ర సింగ్ నివాసంపై సీబీఐ దాడులు చేయడం ప్రస్తావనార్హం.
వీరభద్రుడి అభ్యర్థిత్వమే ఇలా శరణ్యం
ఇంతకుముందు సుఖ్విందర్ సింగ్ను పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని వీరభద్ర సింగ్ కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ను హెచ్చరించారు. తన సన్నిహితులకు టిక్కెట్లు ఇప్పించుకోవడంతోపాటు సీఎం అభ్యర్థిగా తననే ప్రకటించాలని వీరభద్ర సింగ్ ముందే డిమాండ్ చేశారు. ఇప్పటికే సీఎం వీరభద్రసింగ్పై అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపకుండా ఇరుపక్షాల మధ్య రాజీ కుదిరింది. కానీ ఎన్నికల ముందు వీరభద్ర సింగ్ తిరుగుబాటు చేయడం ఇదే మొదటిసారేం కాదు. తనను పీసీసీ అధ్యక్షుడిని చేసి, సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోతే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చేరతామని హెచ్చరించారు. గత ఎన్నికల ముందు ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందాలంటే వీరభద్రసింగ్ను తృప్తి పరచాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సిద్ధమయ్యారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ‘రాజా' అని పిలుచుకునే వీరభద్ర సింగ్ అభ్యర్థిత్వమే శరణ్యమని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావించింది.
సుఖ్విందర్ అభ్యర్థిత్వంవైపే యువనేత మొగ్గు?
కానీ ప్రస్తుతం పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయి. నెహ్రూ - గాంధీ కుటుంబ వారసుడిగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి వీరభద్రసింగ్తో విభేదాలు ఉన్నాయి. కానీ ఆయనకు గల పలుకుబడి, సీనియార్టీ ప్రాతిపదికన పార్టీకి నష్టం వాటిల్లకుండా చూసుకోవాలన్నది కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తెలుసు. కానీ రాహుల్ గాంధీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం వీరభద్రసింగ్, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి సమాచారం తెలుసుకుని ఆశ్చర్య చకితులయ్యారు. రాహుల్ గాంధీ ముఖ్యంగా సుఖ్విందర్ సింగ్ అభ్యర్థిత్వానికే మొగ్గు చూపారు. దీంతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సీఎం వీరభద్రసింగ్కు విభేదాలు పెరిగాయి. గతంలో పార్టీ నాయకత్వంపై ఏ పార్టీ నాయకుడు కూడా ఇటువంటి ఒత్తిళ్లు తేలేదని కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గొప్ప నాయకుడు వీరభద్రసింగ్ మాత్రమేనని, ఆయన చరిస్మాకు తిరుగు లేదని చెప్తున్నారు. కొండలు, పర్వతాలకు నిలయమైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వీరభద్ర సింగ్ వంటి ప్రజాదరణ గల నేతను పక్కన బెడితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గుర్తించింది. దీంతో హిమాచల్ ప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు సుఖ్విందర్ సింగ్ను పక్కనబెట్టక తప్పలేదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడొకరు తెలిపారు.
వారసుడి రాజకీయ ఆరంగ్రేటంపై సీఎం ఇలా
అసెంబ్లీ టిక్కెట్ల పంపిణీలో అందరికీ ప్రత్యేకించి పీసీసీ అధ్యక్షుడు సుఖ్విందర్ సింగ్ ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇస్తామని రాజా వీరభద్ర సింగ్ హామీ ఇచ్చారు. సీఎం అభ్యర్థిగా వీరభద్ర సింగ్ పేరు తప్ప మరో గత్యంతరం లేదని రాహుల్ గాంధీకి తెలుసు. దీనికి తోడు 2012 అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితితో పోలిస్తే వీరభద్ర సింగ్ రాజకీయంగా బలహీన పడ్డారు. ప్రస్తుతం అక్రమాస్తుల కేసులో ఆయనపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నది. అన్ని రంగాల్లో ప్రభుత్వంపై ఉన్న భ్రమలు తొలిగిపోయాయి. వీరభద్ర సింగ్ తన తనయుడు విక్రమాదిత్యను రాజకీయాల్లోకి తీసుకు రావాలని ఆశించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, కాంగ్రెస్ పార్టీపై పూర్తిస్థాయి నెగిటివ్ సెంటిమెంట్ వెన్నాడుతున్నది. ఆర్థిక వ్యవస్థలో మందగమనంపై ప్రధాని మోదీ, ఆయన సారథ్యంలో బీజేపీ ప్రభుత్వంపై విమర్శలతో దాటవేయాలని ప్రయత్నించారు. ఇది శక్తిమంతమైన ఆయుధమే, కేవలం రాష్ట్రస్థాయికి మాత్రమే పరిమితం కాదని, జాతీయ స్థాయిలో ప్రభావం చూపుతుందని హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు చెప్పారు. తాము పోతున్న ఉద్యోగాలు, ధరల పెరుగుదల, జీఎస్టీ అమలులో వైఫల్యంపై ద్రుష్టి సారించామని పేర్కొన్నారు.
వీరభద్రుడి అక్రమాస్తులపై ఇలా బీజేపీ దూకుడు
పర్యాటక రంగంపైనే పూర్తిగా ఆధారపడ్డ హిమాచల్ ప్రదేశ్లో ఆర్థిక రంగ మందగమనం ప్రభావం తీవ్రంగా ఉన్నదని, దీన్నే ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా వాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహం రూపొందిస్తున్నది. అధికార కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతం అవుతుండగా సీఎం వీరభద్ర సింగ్ నాయకత్వానికి వ్యతిరేకంగా, ఆయన అక్రమాస్తులపై బీజేపీ దూకుడుగా ప్రచారం చేస్తోంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆధిపత్య వర్గాలైన బ్రాహ్మణులు, ఠాకూర్లపైనా కమలనాథులు ద్రుష్టి సారించారు. మరోవైపు వివిధ వర్గాలకు చెందిన ప్రజల సమస్యలపై యాత్రలు, సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. మోడీ హవాపై, నిర్ణయాలపైనే ఆశలు పెట్టుకున్న బీజేపీలో ప్రేమ్ కుమార్ ధుమాల్తోపాటు పలువురు నేతలు సీఎం అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతుండటం గమనార్హం. రాష్ట్ర జనాభాలో సుమారు 26 శాతంగా ఉన్న దళితులను దగ్గర చేసుకోవడానికి భారీ స్థాయిలో ప్రచారం చేపట్టిన బీజేపీ.. ఎన్నికల్లో విజయంపై విశ్వాసంతో ఉన్నది. మాజీ సీఎం ప్రేమ్ కుమార్ ధుమాల్ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు కలిగి ఉన్నారు. మరోవైపు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పేరు కూడా సీఎంగా గట్టిగానే పరిశీలిస్తున్నా బీజేపీ అందుకు పూనుకోవడం లేదు. అయితే ప్రస్తుత సీఎం వీరభద్ర సింగ్ మాత్రం దమ్ముంటే సీఎం అభ్యర్థిని ప్రకటించాలని బీజేపీని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు బీజేపీ ‘పరివర్తన్ యాత్ర' నిర్వహిస్తోంది.
గెలుపుపై బీజేపీ నేత మంగళ్ పాండే ఇలా ఆశలు
ఎన్నికల ముంగిట సీఎం వీరభద్ర సింగ్ మరదలు జ్యోతి సేన్ బీజేపీలో చేరారు. గత ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన జ్యోతిసేన్తోపాటు ఆమె సోదరులు వీర్ విక్రం సేన్, ప్రుథ్వీ విక్రం సేన్ తదితరులు బీజేపీ హిమాచల్ ప్రదేశ్ ఇన్ చార్జీ మంగళ్ పాండే సమక్షంలో కమల తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంగళ్ పాండే మాట్లాడుతూ వివిధ సామాజిక వర్గాలు, పార్టీల నేతలు తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేనెల తొమ్మిదో తేదీన సింగిల్ ఫేజ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్ 18వ తేదీన ఫలితాలు వెలువడతాయి.