అసంతృప్తుల నిరసనలతో బిజెపికి తలనొప్పులు, సమాజ్ వాదీకి కలిసివచ్చేనా?
ఉత్తర్ ప్రదేశ్ లో టిక్కెట్లు దక్కని అసంతృప్తులు పార్టీ అధిష్టానం పై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తుల నిరసనలు బిజెపికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.
లక్నో:ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు దక్కని పలువురు బిజెపి నాయకులు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు.తమకు సీట్లు దక్కకపోవడంతో ఉత్తర్ ప్రదేశ్ బిజెపి చీఫ్ కారు ఎదుట రోడ్డుపై పడుకొని బిజెపి నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ దఫా అధికారంలోకి రావాలని చూస్తోన్న బిజెపికి స్వంత పార్టీకి చెందిన నాయకుల నుండే వ్యక్తమౌతోన్న నిరసనలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
టిక్కెట్ల కేటాయింపులో నెలకొన్న ఇబ్బందుల కారణంగా పలువురు పార్టీ నాయకులు అధిష్టానం తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఇతర పార్టీల నుండి వలసలు వచ్చినవారికి టిక్కెట్టు కేటాయించడం కూడ మొదటి నుండి పార్టీనే నమ్ముకొని ఉన్నవారికి టిక్కెట్లు దక్కని పరిస్థితి నెలకొంది.
టిక్కెట్ల కోసం అసంతృప్తుల ఆందోళన
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు దక్కని బిజెపి నాయకులు పార్టీ అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు . తమకు టిక్కెట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్యను నిలదీస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో 403 అసెంబ్లీ స్థానాలుంటే బిజెపి ఇప్పటికే 370 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది.
రోడ్డుపై పడుకొని నిరసన
టిక్కెట్ల కోసం అసంతృప్తులు వినూత్న రీతిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సుందర్ లాల్ దీక్షిత్, రాంబాబు ద్వివేదిలకు పార్టీ టిక్కెట్లు కేటాయించలేదు. దీంతో అసంతృప్తితో వారు నిరసన వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయం ఎదుట రోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు.గంట పాటు పార్టీ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య కారుకు అడ్డుపడ్డారు. రోడ్డుపైనే పడుకొని నిరసనకు దిగారు.
ఫిరాయింపుదారులకు టిక్కెట్లపై నిరసన
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య అసెంబ్లీ స్థానాన్ని పార్టీ కోసం సుదీర్ఘకాలం నుండి పనిచేస్తోన్న వారికి కాదని పార్టీ ఫిరాయించినవారికి కేటాయించడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు బిజెపి కార్యకర్తలు.బిఎస్ పి నుండి బిజెపిలోకి ఇటీవలే చేరిన గుప్తాకు బిజెపి టిక్కెట్టు కేటాయించింది.దీంతో బిజెపి కార్యకర్తలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు.ఫైజాబాద్ ఎంపిని, స్థానిక బిజెపి అధ్యక్షుడిని కట్టేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.
అసంతృప్తులను ఎలా బుజ్జగిస్తారు
ఈ దఫా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు బిజెపి వ్యూహరచన చేస్తోంది . ప్రధానంగా సమాజ్ వాదీ , కాంగ్రెస్ పార్టీ కూటమి నుండి ఆ పార్టీకి సవాల్ ఎదురౌతోంది.అయితే అదే సమయంలో బిజెపి నాయకులు తమకు టిక్కెట్లు దక్కకపోవడంతో నిరసనలు వ్యక్తం చేయడం ఆ పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. అసంతృప్తులను సంతృప్తి పర్చకపోతే పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. అయితే ఈ దిశగా పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంటుందని ఆ పార్టీ సీనియర్లు చెబుతున్నారు.