ఐదుగురి మృతి: బిజెపి ఎమ్మెల్యే, మాజీ ఎంపీలకు పదేళ్ల జైలు
పాట్నా: ఆందోళనలు సృష్టించి రెచ్చగొట్టి ఐదుగురి మరణానికి కారణం అయ్యారని బీజేపీ ఎంఎల్ఏ, ఇద్దరు మాజీ ఎంపీలతో సహ 14 మందికి 10 సంవత్సరాల జైలు శిక్ష పడింది. 17 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం బీహార్ లోని సీతామడీ లోని కోర్టు ఈ తీర్పు చెప్పింది.
గురువారం న్యాయస్థానం బీహార్ లోని పరిహార్ బీజేపీ శాసన సభ్యుడు రాం నరేష్ యాదవ్, జేడీ (యు) మాజీ ఎంపీ నాథల్ కిశోర్ రాయ్, ఆర్జేడీ మాజీ ఎంపీ అన్వరుల్ హక్, ఆర్ఎల్ఎస్పీ నేతలు రాం కిషన్ సింగ్ కుశ్వాహ, మోహన్ కుమార్ సింగ్ తో సహ 14 మందికి 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. మరో దోషి గన్ మ్యాన్ (పోలీస్) సూర్యదేవ్ రాయ్ కి ఐదు సంత్సరాల జైలు శిక్ష విధించారు.
1998లో బీహార్ లో భారీగా వరదలు వచ్చాయి. తరువాత సీతామడీ కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేశారు. అదే సందర్బంలో విధ్వంసం చోటు చేసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు కాల్పులు జరిపారు.
ఈ కాల్పులలో ఐదుగురు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి న్యాయస్థానంలో నివేదిక సమర్పించారు. ఫాస్ట్ ట్రాక్ట్ కోర్టలో విచారణ జరిగింది. రెచ్చగొట్టడం వలనే విధ్వంసం జరిగిందని న్యాయస్థానం గుర్తించి వీరికి శిక్షలు విధించింది.