ఎంపీ అరెస్ట్ కు నిరసన చర్య: పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఆఫీసుకి నిప్పు
పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీలో బీజేపీ కార్యాలయానికి బుధవారం తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు నిప్పంటించారు.
పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీలో బీజేపీ కార్యాలయానికి బుధవారం తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు నిప్పంటించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణం ఉదంతంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సందీప్ బందోపాధ్యాయను సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడం, దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే.
తాము నోట్ల రద్దును వ్యతిరేకించడం వల్లనే ప్రధాని నరేంద్ర మోడీ తమ పార్టీ నాయకులపైకి ఇడి, సిబిఐ, ఆదాయపన్ను శాఖలను ఉసిగొలుపుతున్నారని, ఇలాంటి చర్యలకు తాము భయపడమని విమర్శించిన సంగతి తెలిసిందే. నిన్న కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు కోల్ కతా లోని బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు.
మరోవైపు ఎంపీ బందోపాధ్యాయ అరెస్ట్ కు వ్యతిరేకంగా అ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనల్లో భాగంగానే కొందరు టిఎంసి కార్యకర్తలు హుగ్లీలోని బీజేపీ ఆఫీసును టార్గెట్ చేసుకున్నారు. దానికి నిప్పంటించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.