మరో సీఎం సీటు కిందకు నీళ్లు: ఎసరు పెట్టిన బీజేపీ
న్యూఢిల్లీ: మరో ముఖ్యమంత్రి చాప కిందకు నీళ్లు వచ్చాయి. ఉత్తరాఖండ్ రాష్ర్టంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. అక్కడి హరీష్ రావత్ (కాంగ్రెస్) ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 10 మంది కాంగ్రెస్ రెబల్ శాసన సభ్యులు సిద్దం అయ్యారు. 28 మంది బీజేపీ శాసన సభ్యులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి వారు సిద్దం అయ్యారు.
ఇంత కాలం తెర వెనుక జరిగిన రాజకీయాలు శుక్రవారం రాత్రి పూర్తిగా మారి పోయాయి. రెబల్ శాసన సభ్యులు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. శనివారం బీజేపీ నాయకులను కలిసి చర్చించారు. ఇదే సమయంలో ఉత్తరాఖండ్ కు చెందిన మాజీ సీఎంతో పాటు సీనియర్ బీజేపీ నాయకులు గవర్నర్ ను కలిశారు.
హరీష్ రావత్ ప్రభుత్వం మైనార్టీలో ఉందని, వెంటనే ఆ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని మనవి చేశారు. పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాత తాను తగిన నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ వారికి హామి ఇచ్చారని సమాచారం. రెబల్ శాసన సభ్యులతో కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి బీజేపీ నాయకులు సిద్దం అయ్యారు.
ఈ విషయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. మొదట అరుణాచల్ ప్రదేశ్, ఇప్పుడు ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ శాసన సభ్యులను బీజేపీ నాయకులు కొనేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ దేశద్రోహం చేస్తు అక్రమంగా దొడ్డిదారిలో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు.
ఇదే సమయంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ స్పందించారు. తన ప్రభుత్వానికి పూర్తి బలం ఉందని, శాసన సభ్యులు ఎవ్వరూ బయటకు వెళ్లలేదని అన్నారు. ఒక్క శాసన సభ్యుడు మాత్రం రెబల్ అయ్యాడని, అతని మీద చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హరీష్ రావత్ వివరించారు.