బడ్జెట్: భారత్ ముందు మూడు కీలక ప్రపంచ సవాళ్లు
రానున్న కాలంలో ప్రపంచం నుంచి భారత్కు సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని కేంద్ర ఆర్థిక మంత్రి బుధవారం బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా ప్రస్తావించారు.
న్యూఢిల్లీ: రానున్న ప్రపంచం నుంచి భారత్కు సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని కేంద్ర ఆర్థిక మంత్రి బుధవారం బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా ప్రస్తావించారు. రూ.21.47 లక్షల కోట్ల బడ్జెట్, 3.2 శాతం లోటు, అధిక పన్ను ఆదాయం, ఎక్కువ అప్పులు చేయాల్సిన పరిస్థితి లేకపోవటం వంటి పలు సానుకూలాంశాలున్నాయి. అయితే, ముఖ్యంగా మూడు సవాళ్లను భారత్ ఎదుర్కొక తప్పదని స్పష్టం చేశారు.
ఆయన ప్రస్తావించిన మూడు సవాళ్ల గురించి...
అమెరికాలో వడ్డీ రేట్లు
చాలా కాలంగా మార్పులేకుండా స్ధిరంగా ఉన్న అమెరికా వడ్డీరేట్లు ఇప్పుడు నెమ్మదిగా పెరుగుదల దిశగా కదులుతున్నాయి. ఈ ఏడాదిలో రెండు మూడు దఫాలుగా వడ్డీ రేట్లు పెంచాలనే ఆలోచనను అమెరికా ఫెడరల్ రిజర్వ్ వ్యక్తం చేస్తోంది. అదే జరిగితే మనతో సహా అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటికీ ముప్పేనని స్పష్టమవుతోంది. అధిక వడ్డీరేటు ఆకర్షణతో మనదేశం నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయే అవకాశం ఏర్పడుతుంది.
కొద్దికాలం క్రితం అక్కడ స్వల్పంగా 0.25 శాతం వడ్డీరేట్లు పెరిగాయి. దీంతో విదేశీ పెట్టుబడి సంస్థలు మనదేశం నుంచి పెద్దఎత్తున తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. తత్ఫలితంగా స్టాక్మార్కెట్లు కుప్పకూలాయి. అటువంటిది అమెరికాలో వడ్డీరేట్లు ఇంకా పెరిగితే పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు.
ముడిచమురు(క్రూడ్ ఆయిల్) ధర
అంతర్జాతీయ మార్కెట్లో ఒక బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లకు పైగానే ఉండేది. కానీ రెండేళ్ల క్రితం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఎంతగా ధర పతనం అయిందంటే... రికార్డు స్ధాయిలో 26 డాలర్లు కూడా పలికింది. అనూహ్యంగా కలిసి వచ్చిన ఈ పరిస్థితి ప్రభుత్వానికి ఎంతో మేలు చేసింది.
చమురు సబ్సిడీని భారీగా తగ్గించుకునే అవకాశం వచ్చింది. ఈరోజు భారతదేశం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండటానికి చమురు ధర తక్కువగా ఉండటం ప్రధాన కారణమనేది నిస్సందేహం. కానీ ఇటీవలి కాలంలో ముడిచమురు ధర మళ్లీ పైపైకి చూస్తోంది. ఇప్పుడు 50 డాలర్లకు పైగా ఉన్న ధర ఇంకా పెరుగుతుందని అంటున్నారు. ఇప్పుడున్న స్థా´యిలోనే ఉంటే పర్వాలేదు కానీ ఇంకా పెరిగితే చమురు ధరల భారం పెరిగిపోతుంది. ఆ పరిస్థితి రాదని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.
ప్రపంచీకరణ-రక్షణాత్మక ధోరణులు
ప్రపంచీకరణకు మద్దతుగా ప్రపంచ దేశాలను కూడగట్టిన శక్తులే ఈరోజు రక్షణాత్మక ధోరణులను అనుసరించటం అంతర్జాతీయంగా కనిపిస్తున్న అతిపెద్ద మార్పు. వర్తక రక్షణ విధానాలకు అమెరికా నుంచి పలు దేశాలు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయి. హెచ్ 1 బీ వీసాలపై నియంత్రణ చర్యలతో ట్రంప్ సారధ్యంలోని అమెరికా పెద్దఎత్తున స్వీయ రక్షణ విధానాల వైపు మొగ్గుచూపుతుండటం ఆందోళనకరమైన పరిణామంగా మారింది.
ఇటువంటి చర్యలతో మనదేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు తగ్గిపోయే అవకాశం ఏర్పడుతుంది. ఐటీ, ఫార్మాసూటికల్ పరిశ్రమలు భారతదేశం నుంచి పెద్దఎత్తున ఎగుమతులు నమోదు చేస్తున్నాయి. ట్రంప్ ఆంక్షలు ఈ రంగాలకు ఇబ్బందికరమే. దీంతో ఆర్థిక అంచనాలన్నీ తలకిందులైపోతాయి. ఈ మూడు సవాళ్ల ప్రభావం భారత్పై పడనుందని కేంద్రమంత్రి పేర్కొన్నారు.